ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 1 : అత్యవసర సమయంలో రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని షాదీఖానలో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏళ్లు పైబడిన వారు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. ఏడాదికి కనీసం రెండు సార్లు రక్తదానం చేస్తే అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. స్వచ్ఛంద సంస్థలు యువత రక్తదానం చేసేలా వారిని చైతన్యపరచాలని సూచించారు.
మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీష రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కోఆప్షన్ సభ్యుడు సత్యనారాయణ, ఎజాజ్, సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఖాజా సిరాజుద్దీన్, సభ్యులు ఇమ్రాన్ఖాన్; రాజుయాదవ్, కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.