నిర్మల్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : నిబంధనలు పాటించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా కొనసాగుతున్న ప్రైవేట్ దవాఖానలపై వైద్యాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఆరు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో వంద వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండగా.. వైద్యాధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ నిబంధనల మేరకు నడుస్తున్నాయా? లేదా అని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు నిర్మల్లో 20, ముథోల్లో 12, ఖానాపూర్లో 2 మొత్తం 34 ఆస్పత్రులను తనిఖీ చేయగా.. పదింటికి నోటీసులు(తాఖీదులు) జారీ చేశారు. ఇంకా తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు ఉంటాయని వైద్యాధికారులు పేర్కొనడం కొసమెరుపు.
నిబంధనలు పాటించకుండా, రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝలిపిస్తున్నది. సర్కారు ఆదేశాలతో రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్యశాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహణ ఉందా? లేదా? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దవాఖానలకు నోటీసులు జారీ చేస్తున్నది. ప్రైవేట్ వైద్యశాలలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖాధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగానే ఈ నెల 23 నుంచి నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో అధికారులు తనిఖీ చేపడుతున్నా రు.
అనుమతులు లేని, నిబంధనలు పాటించని దవాఖానలపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ తనిఖీల్లో ఆయా ప్రైవే ట్ వైద్యశాలలకు ప్రభుత్వ అనుమతులున్నా యా..? వైద్యుల పేర్లు, అర్హతలు, సర్టిఫికెట్ల పరిశీలన, ప్రభుత్వ అనుమతులు ఉంటే కాల పరిమితి ఉందా? ముగిసిందా? మొదలగు అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నర్సింగ్హోంలలో అయితే రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, పనిచేసే ఫిజియోథెరపిస్టు, రేడియాలజిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ స్టాఫ్తోపాటు ఇతర ప్రత్యేక వైద్య నిపుణులు, సిబ్బంది అర్హుతలు, తదితరవి సర్టిఫికెట్లు పరిశీలించి మరీ నిర్ధారించుకుంటున్నారు.
ల్యాబ్ నిర్వహణ, సిబ్బంది అర్హత, అల్ట్రా సౌండ్ మిషన్లు ఉంటే వాటిలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు చేశారనే అంశాలను తెలుసుకుంటున్నారు. అలాగే బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను పరిశీలిస్తున్నారు. శానిటేషన్, ఫైర్సేఫ్టీతో పాటు ఇతర వసతులు, డాక్టర్లు, సిబ్బంది రిజిస్ట్రేషన్ పత్రాలను సరి చూస్తున్నారు. తనిఖీల సమయంలో పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. మామూలు జ్వరం, జలుబులతో బాధపడుతూ ప్రైవేట్ వైద్యశాలలకు వెళితే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అంటూ డాక్టర్లు రకరకాల టెస్టులు రాసి రోగులపై అదనపు భారం మోపుతున్నారన్న విమర్శలున్నాయి.
34 వైద్యశాలల్లో తనిఖీలు..
నిర్మల్ జిల్లాలోని భైంసా, నిర్మల్, ఖానాపూర్ పట్టణాల్లో సుమారు 100 వరకు ప్రైవేట్ వైద్యశాలలున్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ బృందాల్లో ఇద్దరు డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోలు, ఇద్దరు ప్రోగ్రాం ఆఫీసర్లు, ఒక డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి ఉన్నారు. వీరు ప్రతిరోజూ ఎంపిక చేసిన దవాఖానల్లో తనిఖీలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఆరు రోజులుగా 32 దవాఖానల్లో తనిఖీలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో నిబంధనలు పాటించని 10 వైద్యశాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటి నిర్వాహకులకు వారం గడువు ఇచ్చి ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు నిర్మల్లో 20, భైంసాలో 12, ఖానాపూర్లో రెండు వైద్యశాలల్లో తనిఖీలు జరిగాయి.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని సుమారు 100 ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేస్తున్నాం. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 34 వైద్యశాలల్లో తనిఖీలు చేసి పదింటికి నోటీసులిచ్చాం. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– ధన్రాజ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, నిర్మల్