ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబర్ 28 : సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసే అభివృద్ధి పనులు ప్రధాని మోదీకి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేయడం చేతకాకపోవడం సిగ్గు చేటని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.ఇందులో భాగంగానే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు డప్పుచప్పుళ్ల మధ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద మంజూరైన రూ.1.30 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. దళితబంధు లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలా భిషేకం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగురామన్న కృషితో నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకెళ్తున్నదన్నారు. గతంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాను టీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక ప్రధాని మోదీ తెలంగాణపై ఈర్ష్య వ్యక్తం చేస్తున్నారన్నారు. మతం పేరుతో ఓట్లు వేసుకుందామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. మండలంలోని యాపల్గూడ, కొత్తగూడెం, ఛిచ్ధరి, లోహర గ్రామాలకు చెందిన దళితులకు పంపిణీ చేసిన దళితబంధు యూనిట్లపై ఆయన ఆరా తీశారు. లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. దళితుల అభ్యున్నతికి పాటుపడిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును సచివాలయానికి పెట్టాలని నిర్ణయించడం గర్వించదగ్గ విషయమన్నారు. అటు పార్లమెంట్ భవనానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గండ్రత్ రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, మెస్రం పరమేశ్వర్, సెవ్వ జగదీశ్, కొడప సోనేరావ్, జంగు పటేల్, రమణ తదితరులు పాల్గొన్నారు.