మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 25 : ప్రతి క్రీడాకారుడూ గెలుపే లక్ష్యంగా ఆడాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. ఆదివారం డీవైఎస్వో మైదానంలో తెలంగాణ రాష్ట్ర ఆరవ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ చాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు. ఇటీవల పట్టణానికి చెందిన గోపు శ్రీనివాస్ అనే బాడీ బిల్డర్ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి ప్రభుత్వం ఉద్యోగం సాధించాడని గుర్తు చేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని బాస్కెట్ బాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్, సెక్రటరీ సుకుమార్ ఫ్రాన్సిస్, స్టేట్ సెక్రటరీ, ఎఫ్ఐబీఏ ఇంటర్నేషనల్ టెక్నీషియన్ నార్మన్ ఇసాక్, అబ్జర్వర్, డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, ప్రోగ్రాం కో కన్వీనర్ సంపత్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ఆర్ శ్రీనివాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ రోజావరకుమారి, అడ్వైజర్లు బీ కిషన్, రాజమౌళి, చంద్రమౌళి, తిరుపతి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
బాస్కెట్బాల్ చాంపియన్ షిప్ పోటీలకు 18 జిల్లాల బాలుర జట్లు రాగా, 15 జిల్లాల నుంచి బాలికల జట్లు హాజరయ్యాయి. ఒక్కో గ్రూపులో మూడు జిల్లా జట్ల చొప్పున ఆరు గ్రూపులుగా బాలుర జట్లు, ఐదు గ్రూపులుగా బాలికల జట్లు చాంపియన్ షిప్ కోసం పోటీపడుతున్నాయి. ఈ నెల 27న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ములుగు, హైదరాబాద్, ఆదిలాబాద్, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, వికారాబాద్, మేడ్కల్ మల్కాజిగిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.