నిర్మల్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి ఏ కష్టం రావొద్దని.. వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు పథకంతో పంట పెట్టుబడి సాయం అందిస్తూనే వివిధ కారణాలతో మరణించిన రైతుకుటుంబాలకు అండగా నిలుస్తున్నది. ఇందుకోసం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేశారు.
అలాగే ఇన్పుట్ సబ్సిడీ, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రైతులకిచ్చిన మాట ప్రకారం రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసింది. మొదటి విడుతలో మూడేండ్లలో రుణ మాఫీని పూర్తి చేసి రైతు ప్రభుత్వంగా నిలిచింది. అలాగే రెండో విడుత రుణ మాఫీలో భాగంగా రూ.లక్షలోపు పంట రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేసేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే రూ.25వేల లోపు రుణాలను మాఫీ చేశారు. ఇటీవలే రెండో దఫాలో రూ.25వేల నుంచి 50వేల లోపు రుణాలను సైతం మాఫీ చేశారు. అంతే కాకుండా వ్యవసాయ రంగానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇతర రాష్ర్టాల్లో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మండు వేసవిలో కూడా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తుండడం గమనార్హం. అదేవిధంగా రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున రెండు పంటల కోసం పెట్టుబడి సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది.
రైతుబంధుతో పాటు రైతు కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతు కుటుంబాల్లోని పెద్దదిక్కు మరణిస్తే రూ.5లక్షల సహాయాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి కుటుంబాలను అప్పుల బారి నుంచి కాపాడడమే కాకుండా బాధిత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఆదుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో గత ఐదేండ్లలో 2376మంది రైతులు మరణించగా, సంబంధిత కుటుంబాలకు ఈ పథకం కింద రూ.5లక్షల చొప్పు న రూ. 118.80కోట్లను అందజేశారు.
బాధిత రైతు కుటుంబాలకు మొదట్లో రూ.5లక్షల బీమా డబ్బులను బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం, తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. కాగా ఈ పథకాన్ని 2018 పం ద్రాగస్టున సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నాటి నుంచి 2018-19 సంవత్సరంలో 545 కుటుంబాలకు రూ.27.25 కోట్లు అందజేసింది. అలాగే 2019-20 సంవత్సరంలో 512 కుటుంబాలకు రూ.25.65 కోట్లు, 2020-21లో 694 కుటంబాలకు రూ. 34.70కోట్లు, 2021-22 సంవత్సరంలో 613 కుటుంబాలకు రూ.30.65కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
కాగా ఈ ఏడాది పంద్రాగస్టు నుంచి ఈనెల 20 వరకు 79మంది రైతు కుటుంబాలు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోగా 12 కుటుంబాలకు రూ. 60లక్షలను పంపిణీ చేశారు. మిగతా వారి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నదని, త్వరలోనే వారికి కూడా జమవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కాగా రైతుబీమా పథకంలో భాగంగా బీమా సంస్థలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఒక్కో రైతుకు రూ.3486 ప్రీమియం డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయితే జిల్లా వ్యాప్తంగా 1,75,600 మంది రైతులు ఉండగా, వీరిలో 1,17,454 మంది రైతుబీమాకు అర్హులుగా వ్యవసాయ శాఖ యంత్రాంగం గుర్తించింది. దీంతో ఈ ఏడు రైతుబీమా కోసం రూ. 40కోట్ల 94 లక్షల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించింది.
మాకు ముజ్గి శివారులో 5గుంటల భూమి ఉంది. నా భర్త వడ్ల శంకర్ ఆరోగ్యం బాగా లేక 2019లో చనిపోతే ప్రభుత్వం రైతుబీమా కింద రూ.5లక్షల సాయం చేసింది. 2018లో నా భర్త ఉన్నప్పుడు 4లక్షల దాకా బాకీలు చేసి ఇల్లు కట్టిండు. సీఎం కేసీఆర్ సారు సాయం చేయబట్టి ఇల్లు బాకీ తీరింది. నా భర్త బతికున్నప్పుడు ఉన్న 5గుంటల భూమిలో కూరగాయలు పండిస్తుండే. ఇంకా బయట పనులు చేసి కుటుంబాన్ని నడుపుతుండె. ఆయన చనిపోయినంక నేను, నా ఇద్దరు పిల్లలు బతుకుడు ఎట్లా అని భయపడ్డ. కష్టకాలంలో ప్రభుత్వం రైతుబీమా కింద రూ.5 లక్షలు సాయం చేసి ఆదుకున్నది.
-వడ్ల లక్ష్మి, ముజ్గి
మానాన్న చిట్నేడి భీమన్న ఇదే ఏడాది జనవరిలో గుండెపోటుతో చనిపోయిండు. మా నాన్న పేరుమీద కప్పన్పెల్లిలో 29 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. చనిపోయిన 10రోజులకు నాఖాతాలో రూ.5లక్షలు జమ చేసిన్రు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మాకు సీఎం సారు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన్రు. మాతల్లిదండ్రులకు నేను ఒక్కడినే. రైతుబీమా కింద వచ్చిన రూ. 5 లక్షలతో మరో మిత్రుడితో కలిసి వరికోత మిషన్ కొన్న. దీని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న.
– సీహెచ్.భీమేశ్, కప్పన్పెల్లి