నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 23 : పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూ హక్కు పత్రాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదనిచ, అధికారులు రైతులను పారదర్శకంగా గుర్తించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన పోడు భూముల పట్టాల పంపిణీ సమన్వయ కమిటీ సమావేశానికి ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖశ్యాంనాయక్తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని జిల్లాల్లో ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పత్రాలను అందిస్తామని ప్రకటించడమే కాకుండా, ఇటీవల జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ కన్వీనర్గా సభ్యులుగా డీఎఫ్వో, డీటీవో, అధికారులు గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఉంటారని తెలిపారు. నిర్మల్ జిల్లాలో పోడు వ్యవసాయం సాగు చేసుకుంటున్న రైతుల నుంచి గతంలో దరఖాస్తులు స్వీకరించగా.. సుమారు 6వేల వరకు అర్జీలు వచ్చాయని చెప్పారు.
వాటిపై అధికారులు సర్వే చేసి, వివరాలను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిపారు. అర్హులైన గిరిజనులకు మాత్రమే పట్టాలిచ్చేలా కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో పోడు భూముల సమస్య కొన్ని మండలాల్లో ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించి, రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులను మాత్రమే ఎంపిక చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. మహారాష్ట్రకు చెందిన గిరిజనులు ఈ ప్రాంతంలో వచ్చి పోడు భూములు సాగు చేసుకుంటే, వారిని అనర్హులుగా గుర్తించాలన్నారు. అనంతరం దళితబంధుపై మంత్రి సమీక్షించారు. రెండో విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్లను మంజూరు చేస్తామని, అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల గురుకులాల్లో విద్యార్థులకు సరైన ఆహారం అందించడం లేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ప్రభుత్వం 2018 నుంచి ఇప్పటివరకు ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నియోజకవర్గానికి రెండు చొప్పున బీసీ గురుకులాలతో పాటు మైనార్టీ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందిస్తున్నదని చెప్పారు.