నేరడిగొండ,సెప్టెంబర్ 23 : పోడు భూముల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ గ్రామ కమిటీ సభ్యులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం గ్రామ కమిటీ సభ్యులకు సర్వేపై శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో పోడు భూముల సర్వేలో దరఖాస్తు చేసుకున్న వారు అర్హులను గుర్తించేందుకు తగు సలహాలు, సూచనలు చేశారు. రెవెన్యూ, అటవీ శాఖాధికారి, పంచాయతీ కార్యదర్శి కలిసి గ్రామంలో టీంగా వెళ్లి సర్వే చేసే అంశంపై అవగాహన కల్పించారు. అర్హులను గుర్తించి నివేదికలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ పవన్చంద్ర, ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎఫ్ఆర్వో గణేశ్, ఎంపీవో శోభన, పంచాయతీ కార్యదర్శులు, అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, సెప్టెంబర్ 23 : పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తహసీల్దార్ రాథోడ్ మోహన్సింగ్ పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బందితో పోడు భూముల సాగుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం 2005 ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి పారదర్శకంగా అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, బీట్ అధికారి క్షేత్ర పర్యటనకు వెళ్లి, సంబంధిత కోఆర్డినేటర్ ద్వారా జీపీఎస్ నమోదు చేయాలని ఆదేశించారు. ఇకపై అడవులను తొలగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖాధికారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వామనభట్ల రాంప్రసాద్, ఎంపీవో కొమ్ము రమేశ్, అటవీ శాఖ అధికారి పాండురంగ్, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, సిబ్బంది పాల్గొన్నారు.
సిరికొండ, సెప్టెంబర్ 23 : పోడు భూముల కోసం ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డిప్యూటీ అటవీ శాఖ అధికారి గీరయ్య అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఆర్సీ, కమిటీల ద్వారా గ్రామసభలు, పోడు భూముల సర్వే నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కులు కల్పించేందుకు, గ్రామస్తుల నిర్ణయం మేరకు పోడు రైతుల్లో అర్హులను గుర్తిస్తామన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో వాహబ్, తహసీల్దార్ సర్ఫరాజ్, ఎంపీడీవో సురేశ్, నాయబ్ తహసీల్దార్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.