గిరిజనులకు ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ పెంపు, పేద గిరిజనులకు దళితబంధు మాదిరిగా గిరిజన బంధు అమలు, పోడు భూముల సమస్యల పరిష్కారం, రూ.60 కోట్ల ఖర్చుతో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీం ఆదివాసీ భవన్లు ప్రారంభించడంతో అడవి బిడ్డల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆదివాసీ-బంజారా ఆత్మీయ భవనాల వేదికగా ప్రకటించడంతో గిరిజన నాయకులు, గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గిరిజన సంక్షేమ సారథికి అంతా మంచి జరగాలని, ఆయన దేశరాజకీయాల్లో కూడా రాణించాలని, అప్పుడే దేశంలోని గిరిజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
– ఆదిలాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం అడవిబిడ్డల సంబురాలు అంబరాన్నంటాయి. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపు, గిరిజనబంధు అమలు, సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీం ఆదివాసీ భవనాలను ప్రారంభించడం, పోడు సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పల్ధరి గ్రామంలో సర్పంచ్ శ్రీధర్రెడ్డి.. ఉట్నూర్లోని అంబేద్కర్ చౌక్లో ఎంపీపీ పంద్ర జైవంత్రావు.. సిరికొండ మండల కేంద్రంతోపాటు సోంపల్లి గ్రామంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు.. బజార్హత్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో టీఆర్ఎస్ నాయకులు, గిరిజనులు.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారుతి పటేల్డోంగ్రే నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని లంబాడిపల్లి గ్రామపంచాయతీలో కిష్టంపేట ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్.. కోటపల్లి మండల కేంద్రంలో రాజారాం ఎంపీటీసీ శేఖర్.. భీమారం మండల కేంద్రంలో జడ్పీటీసీ బుక్యా తిరుమలా లక్ష్మణ్, జన్నారం మండలంలోని పొనకల్ రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే రేఖానాయక్.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్ రావు తన నివాసం వద్ద మాలీ కులస్తులతో సంబురాలు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్యే రేఖానాయక్, దస్తూరాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ఐలయ్య యాదవ్, పెంబి మండల కేంద్రంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ భుక్యా టీకాజీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్రెడ్డి పాల్గొని క్షీరాభిషేకం చేశారు.
– ఆదిలాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆదిలాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదివా సీ సమాజానికి ప్రత్యేక గుర్తింపు గా హైదరాబాద్లో కుమ్రం భీం భవనం నిర్మించినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. జోడేఘాట్లో ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి ఆదివాసుల గుండెల్లో నిలిచారు. పది శాతం రిజర్వేషన్లు పెంచడమనేది సాహసోపేతమైన నిర్ణయం. మా సమస్యలను తెలుసుకుని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదివాసులకు గౌవరం లేకుండే. కానీ.. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
– పెందూర్ సుధాకర్, ఆదివాసీ పర్థాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆసిఫాబాద్.
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 18 : ఆదివాసులకు ప్రత్యేక గౌరవం లభించిందనడానికి నిదర్శనం కుమ్రం భీం పేరిట ఆసిఫాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయడం. దీంతోపాటు హైదరాబాద్లో ప్రభుత్వం ఆదివాసులకు ప్రత్యేక భవనం కట్టించి ఆదివాసీ సమాజాన్ని గౌరవించింది. జనాభా పెరిగినప్పటికీ ఏ సర్కారోళ్లు రిజర్వేషన్ల పెంపును పట్టించుకోలేదు. కానీ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అటవీ హక్కులకు సంబంధించి కొన్ని పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ను బదనాం చేస్తున్నారు. అటవీ హక్కు, పోడు భూముల వ్యవహారంలో కేంద్ర వైఖరి బాగోలేక పోవడంతోనే.. ఆ సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు మోదీని ఒప్పించి పోడు భూముల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి. గిరిజన బంధు అనేది పేదలకు లబ్ధి చేకూర్చనుంది.
– కనక యాదవరావు, జిల్లా పంచాయతీ రాయిసెంటర్ గౌరవ అధ్యక్షుడు, ఆసిఫాబాద్.
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 18 : గిరిజన బంధు.. పేద గిరిజనుల ఆర్థిక ఎదుగుదలకు దోహద పడుతుంది. గూడేల్లో ఆదివాసులు వెనుకబడి ఉన్నారని గ్రహించిన కేసీఆర్ ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. రిజర్వేషన్లను 10 శాతాన్ని పెంచడంతో అదివాసుల అభివృద్ధికి తోడ్పతుంది. అభ్యున్నతికి, అభివృద్ధికి బాటలు వేస్తున్న కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. మిగిలిన ఆదివాసుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కారిస్తారని ఆశిస్తున్నాం.
– మడావి గుణవంత్రావు, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆసిఫాబాద్.
కాగజ్నగర్, సెప్టెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న గిరిజన బంధుతో అడవి బిడ్డలకు మేలు జరుగనుంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలపాటు రాష్ర్టాన్ని ఏలాయి. కానీ.. ఓటు బ్యాంకు రాజకీయం తప్పా.. పట్టించుకున్న వారు లేరు. కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని.. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపనున్నారు. వ్యాపార రంగంలో రాణించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఇందుకు కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– సడ్మెక పురుషోత్తం, గిరిజన నాయకుడు, బెజ్జూర్.
కాగజ్నగర్, సెప్టెంబర్ 18 : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ముదావహం. రిజర్వేషన్ పెంపుతో యువతీయువకులకు ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఎనిమిదేళ్లలో గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం మెరుగుపడింది. రవాణా బాగుండడంతో పల్లెలు పట్టణాల మాదిరిగా ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రవాణా సౌకర్యం మెరుగుపడింది. గిరిజనుల కోసం రాష్ట్ర రాజధానిలో ఆదివాసీ భవన్ నిర్మించి తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. అన్నివర్గాల ప్రజలకు సముచితంగా పథకాలు అమలు చేస్తూ.. గిరిజనుల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న నాయకుడు దేశంలో ఎవరు లేరు. గిరిజన బంధు అమలు చేసి ప్రత్యేక గుర్తింపునివ్వడం ఆనందంగా ఉంది.
– మెర్పె బ్రహ్మయ్య, ఆదివాసీ కొలావార్ మన్నేవార్ జిల్లా అధ్యక్షుడు.
కాగజ్నగర్, సెప్టెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించడం చాలా మంచి పరిణామం. దశాబ్దాలుగా పోడు భూములకు పట్టాలు లేక పోడు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముత్తాతల నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా.. అటవీ అధికారులు దాడులు చేసి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. చేలలో వేసిన పంటలను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించారు. పట్టాలు వస్తే రైతులకు ప్రభుత్వ పథకాలు కూడా అందుతాయి. సాధారణ రైతు మాదిరిగా బ్యాంకు రుణాలు పొంది లాభసాటి వ్యవసాయం చేసుకోవడంతో మేలు జరుగుతుంది.
– కొమురం మాంతయ్య, రాజ్గొండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు.
కాగజ్నగర్, సెప్టెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఆదివాసీ భవన్ నిర్మించి గిరిజనుల ఆత్మగౌరవం పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో గిరిజనుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిది. గిరిజనులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడి ఉన్న గిరిజనులు.. కేసీఆర్ చేయూతతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు. విద్యకు దూరంగా ఉన్న గిరిజన యువత ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్నారు. గిరిజన గ్రామాలకు నూతన పంచాయతీలు, మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది.
– ఆలం సకారాం, గిరిజన నాయకుడు, పెంచికలపేట్.
దహెగాం, సెప్టెంబర్ 18 : సీఎం కేసీఆర్ గిరిజనుల పక్షపాతి. అందుకే గిరిజనులను అదుకునేందుకు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించడం, గిరిజన బంధు అమలు చేస్తాననడం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం చేయలేని పనులను సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో అన్ని కులాలను సమానంగా చూస్తున్నారు.
– హట్కరి మధూకర్, గిరిజన నాయకుడు, కల్వాడ.