నిర్మల్ అర్బన్, ఆగస్టు 17 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు విద్యను బలోపేతం చేస్తున్నది. కేజీబీవీ విద్యార్థులకు ఒకేచోట ఉన్నత చదువులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా కేజీబీవీలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదువుతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే కోర్సులు ప్రవేశపెడుతూ వారి బంగారు భవిష్యత్కు భరోసా కల్పిస్తున్నది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఒకప్పుడు డ్రాపౌట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీలు ప్రస్తుతం కళాశాలలుగా అప్గ్రేడ్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నది. అందులో భాగంగా నాణ్యమైన ఉచిత విద్యతో పాటు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందిస్తున్నది. దీంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరేందుకు బారులు తీరుతున్నారు. నిర్మల్ జిల్లాలోని రెండు కేజీబీవీలు అప్గ్రేడ్ అయ్యాయి. ఇప్పటికే ముథోల్ కేజీబీవీ కళాశాలలో అడ్మిషన్లు నిండిపోయాయి. దస్తురాబాద్లోని కళాశాలలోని ఎంపీసీ విభాగంలో ఇంకా 9 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో 8 కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం రెండు కళాశాలలను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నిర్మల్ జిల్లాలో వీటి సంఖ్య 10కి చేరింది. కేజీబీవీ కళాశాలను విద్యార్థుల సౌకర్యార్థం కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అధునాతన హంగులతో నూతన కళాశాలల భవనాలను నిర్మించింది. నిర్మల్ అర్బన్, లక్ష్మణచాంద, మామడ, కడెం, జాం, నర్సాపూర్, దిలావర్పూర్లో ఉండగా, ప్రస్తుతం దస్తూరాబాద్, ముథోల్ మండలాల్లో ప్రభుత్వం కేజీబీవీలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. రానున్న రోజుల్లో అన్ని మండలాల్లోని పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసి, బాలికా విద్యను వారు నివసించే గ్రామాలకు అతి సమీపంలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టనున్నది. ఒక్కో కోర్సుకు 40 మంది విద్యార్థుల చొప్పున రెండు కోర్సులకు గాను 80 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
రెగ్యులర్ విద్యతో పాటు ఉపాధి కోర్సులు..
ఇష్టమైన రంగాల్లో రాణించేలా విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వం కోర్సులను ప్రవేశపెడుతూ ఉచిత విద్య అందిస్తున్నది. సాధారణంగా సాంప్రదాయ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులను అందుబాటులో ఉంచింది. వీటితో పాటు ఉపాధి కోర్సులను కూడా ప్రవేశపెడుతూ విద్యార్థులు తమ కాళ్లపై నిలబడేలా చర్యలు చేపట్టింది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులతో పాటు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులను సైతం ప్రవేశపెట్టింది. జిల్లాలోని ముథోల్, మామడ, కడెం కళాశాల్లో ఎంపీహెచ్డబ్ల్యూ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉండగా, విద్యార్థులు ఉపాధి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి గ్రూపునకు ప్రథమ సంవత్సరం 40 మంది విద్యార్థులు (రెండు కోర్సులకు కలిపి 80), ద్వితీయ సంవత్సరం 40 మంది విద్యార్థులకు (రెండు కోర్సులకు కలిపి 80)సీట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
విద్యార్థులకు ఎంతో ప్రయోజనం..
ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని కేజీబీవీలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. దీంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పాఠశాల విద్యనభ్యసించిన చోటే మాద్యమిక విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఒకప్పుడు డ్రాపౌట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీలు, ప్రస్తుతం కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలతో పోటీ పడుతున్నాయి. విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నారు.
– శ్రీదేవి, సెక్టోరియల్ అధికారి, నిర్మల్)