స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు ర్యాలీలు నిర్వహించి యువతలో జోష్ నింపారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నిర్మల్, ఖానాపూర్ పట్టణాల్లో ముస్లిం జేఏసీ, ఎండీసీ ఆధ్వర్యంలో బైక్ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో పాల్గొని జాతీయభావాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తాపట్నాయక్, బోథ్లో ఎమ్మెల్యే బాపురావు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కళాకారుల ప్రదర్శనను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రారంభించారు. గాంధీచౌక్ కాలనీకి చెందిన శ్రీ రామోజు నరేశ్ బంగారంతో జాతీయ పతాకాన్ని తయారు చేసి జాతీయతను చాటుకున్నాడు.
ఎదులాపురం/నిర్మల్ అర్బన్, ఆగస్టు 14 : స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు జోష్గా నిర్వహించారు. బోథ్ నియోజకవర్గం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. విద్యార్థులు, కళాకారులతో ఆడిపాడుతూ, వారితో నృత్యాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరయ్యారు. ఫైర్స్టేషన్ ఎదుట పటాకులు కాల్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఏఎస్పీ, డీఎస్పీ, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో..
సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమాన్ని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రారంభించారు. గాంధీచౌక్ కాలనీకి చెందిన శ్రీ రామోజు నరేశ్ 400 మిల్లీ గ్రాముల బంగారంతో జాతీయ పతాకాన్ని తయారు చేసి జాతీయతను చాటుకున్నాడు. శాంతినగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు 75 ఆకృతిలో కూర్చొని దేశభక్తిని చాటుకున్నారు. భైంసా పట్టణంలో క్రీడా పోటీలు నిర్వహించగా.. ఆర్డీవో లోకేశ్వర్రావు పాల్గొని మాట్లాడారు. ఖానాపూర్లో ముస్లిం జేఏసీ, ఎండీసీ ఆధ్వర్యంలో బైక్ర్యాలీ తీశారు. జాతీయభావం చాటుతూ భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.