ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసం స్థలు, సంక్షేమ హాస్టళ్లలో ఈ యేడాది ప్రవేశాల తాకిడి పెరిగింది. పేద విద్యార్థుల చదువులపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టి, అన్ని వసతులు కల్పిస్తుండడంతో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యనందిస్తుండడం, ప్రైవేట్లో ఫీజుల భారం మోయలేనంతగా పెరగడంతో వసతిగృహాల్లో చేరికలు పెరుగుతున్నాయి. ఈ యేడాది బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు కొత్త విద్యార్థుల ప్రవేశాలతో కళకళలాడుతున్నాయి.
నిర్మల్ టౌన్, ఆగస్టు 14: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. సర్కారీ విద్యాసంస్థలు, హాస్టళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. దీంతో ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగి వసతి గృహాలు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఆంగ్ల బోధనను అమలు చేయనున్న నేపథ్యంలో, చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది.
ఈ గురుకులాల్లో సీట్లు సాధించే వారికి హాస్టళ్లలో ఉండి చదువుకునేందుకు వసతి కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండేళ్ల క్రితం కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో అడ్మిషన్ల సంఖ్య పడిపోగా.. ఈ ఏడాది ఖాళీల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లు 76 ఉన్నాయి. మొత్తం 7,870 సీట్లు ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో 4,540 సీట్లు ఖాళీలుండగా.. ఇప్పటికే 3,400 మందికి పైగా చేరినట్లు జిల్లా అధికారులు తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల విషయానికొస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లు 58 ఉండగా.. మొత్తం 5,540 మంది విద్యార్థులకు అనుమతి ఉండగా.. 2232 ఖాళీలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఖాళీలకు మించి, దరఖాస్తులు రాగా, అందరినీ చేర్చుకున్నట్లు తెలిపారు.
హాస్టళ్లలో మెరుగైన వసతి.. సౌకర్యాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న హాస్టళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నది. గతేడాది ఒక్కో హాస్టల్కు నిర్వహణ ఖర్చు కింద రూ.50వేలను మంజూరు చేయగా.. ఆ నిధులతో హాస్టళ్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఫ్యాన్లు, తదితర చిన్న చిన్న మరమ్మతులు నిర్వహించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారు. హాస్టల్ గదులకు అందమైన రంగులను వేయించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, అవసరమైన స్టడీ మెటీరియల్, సాయంత్రం వేళ ట్యూటోరియల్ క్లాస్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలను హాస్టళ్లలో అడ్మిషన్ ఇప్పించి ప్రభుత్వ విద్యను పొందుతున్నారు. కరోనా కంటే ముందు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదవడం వల్ల ఫీజుల భారం ఎక్కువగా ఉండడం, ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ పాఠశాలలో లేకపోవడం వల్ల హాస్టళ్లలో డిమాండ్ తగ్గింది. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం ప్రారంభం కావడంతో ప్రభుత్వ హాస్టళ్లలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బాలబాలికలు చదువుకుంటున్నారు. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరారు.
బీసీ సంక్షేమ హాస్టళ్లలో అడ్మిషన్లు ఫుల్…
నిర్మల్ జిల్లాలో బీసీ సంక్షేమశాఖ ద్వారా నిర్వహించబడుతున్న హాస్టళ్లలో అడ్మిషన్ క్లోజ్ బోర్డులు కన్పిస్తున్నాయి. జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ హాస్టళ్లలో 954 మాత్రమే ఖాళీలుండగా, అంతకుమించి దరఖాస్తులు అందాయి. దీంతో వారందరికీ హాస్లళ్లలో చేర్చుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని దిలావర్పూర్, భోసి, మస్కాపూర్, లక్ష్మణచాంద, కడెం, సారంగాపూర్, బీరవెల్లి, బాసర, తదితర హాస్టళ్లలో 80 మంది విద్యార్థులకుగాను గతంలో 20 మంది ఉండగా.. ఇప్పుడు 60-70 మంది విద్యార్థులు కొత్త అడ్మిషన్లు తీసుకున్నారు.
పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ
బీసీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుం టున్నాం. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయిస్తున్నాం. స్టడీ మెటీరియల్స్, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక స్టడీ అవర్స్ను నిర్వహిస్తున్నాం. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. దీంతోనే సంక్షేమ హాస్టళ్లపై విద్యార్థులకు నమ్మకం పెరిగింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే పది హాస్టళ్లలో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి.
-నాగారావు, బీసీ సంక్షేమశాఖ జిల్లా డివిజన్ అధికారి
50 సీట్ల కోసం ప్రతిపాదనలు పంపాం..
మాది తానూరు మండలంలోని భోసి ఉన్నత పాఠశాల. మా పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 540 మంది పిల్లలు చదువుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దులో మా గ్రామం ఉంది. ఇక్కడ పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో క్లాసులు చెబుతున్నాం. మా గ్రామంలోని బీసీ హాస్టల్లో ప్రస్తుతం 135 మంది విద్యార్థులకు మాత్రమే హాస్టల్లో ఉండే చాన్స్ ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 150కి పెరిగింది. మరో 50 మంది దరఖాస్తు చేసుకోవడంతో ఎమ్మెల్యే విఠల్రెడ్డి దృష్టికి తీసుకొచ్చి అదనంగా 50 సీట్లు కావాలని అడిగాం.
– గంగాధర్, హెచ్ఎం, భోసి
అడ్మిషన్లు పూర్తయ్యాయి..
నిర్మల్ జిల్లాలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హాస్టళ్లలో ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. నాకు లక్ష్మణచాంద, పొన్కల్ బీసీ సంక్షేమ హాస్టళ్లుండగా.. పొన్కల్ లో 75, లక్ష్మణచాందలో 85 కొత్త దరఖాస్తులు వచ్చాయి. గతంలో రెండు హాస్టళ్లను కలిపి 60 మంది వరకు మాత్రమే విద్యార్థులుండేది. ఈ ఏడాది వారి సంఖ్య రెట్టింపయ్యింది. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం.
-రాఘవేందర్, బీసీ హాస్టల్ వార్డెన్, లక్ష్మణచాంద
సీట్లు లేక ఇబ్బంది పడుతున్నరు..
నిర్మల్ జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మొత్తం 17 హాస్టళ్లున్నాయి. ఇందులో ప్రీ, పోస్టు మెట్రిక్ హాస్టళ్లున్నాయి. ప్రస్తుతం 4450 మంది విద్యార్థులు హాస్టల్లోనే ఉండి చదువుకునేందుకు అవకాశం ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 5వేలకు పెరిగింది. ఎందరో పేద విద్యార్థులు హాస్టల్కు వచ్చి వారి తల్లిదండ్రులతో సీట్లు కావాలని బతిమిలాడినా ఇచ్చే పరిస్థితి లేదు.
-శ్రీనివాస్రెడ్డి, గిరిజన సంక్షేమజిల్లా అధికారి
బీసీ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నం..
సోన్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలనే ఉద్దేశంతో అడ్మిషన్ తీసుకున్నం.. ఉపాధ్యాయులు ముందే చెప్పిన్రు. సోన్ బీసీ హాస్టల్లో అడ్మిషన్ ఇప్పించిన్రు హాస్టల్లో ఉంటూ కిలోమీటరు దూరంలో ఉన్న సోన్ ఉన్నత పాఠశాలకు రోజూ వెళ్లి చదువుకొని వస్తున్నం. హాస్టల్లో మంచి వసతులు కల్పించిన్రు.
-శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రదీప్