ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 11 : మహిళల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, పలువురు మహిళా కార్యకర్తలతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి వారితో ముచ్చటించారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం పెంచేలా ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ వర్తింపజేసింది టీఆర్ఎస్ పార్టీనేనని గుర్తు చేశారు. కాన్ఫరెన్స్లో మహిళా విభాగం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు స్వరూపారాణి, మమత పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విఠల్రెడ్డితో..
భైంసా, ఆగస్టు 11 : వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. 13.30 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందించినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ పాలనలో పింఛన్ పెరిగిందని గుర్తు చేశారు. కాన్ఫరెన్స్లో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు తోట రాములు పాల్గొన్నారు.
ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు
భైంసా, ఆగస్టు 11 : పట్టణంలోని వాసవి పాఠశాలలో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బాలికలు బాలురకు రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డికి ముస్లిం మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.