ఎదులాపురం, ఆగస్టు 11: ఉచిత బహుమతులు, లాటరీలకు ఆకర్షితులై సైబర్ నేరస్తుల వలలో చిక్కుకోవద్దని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన 100 మంది విద్యార్థులకు బహుమతులను ఎస్పీ డీ.ఉదయ్ కుమార్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ సెల్ఫోన్ల వాడకం పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయని చెప్పారు. సైబర్ క్రైమ్పై సైబర్ అంబాసిడర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సైబర్ అంబాసిడర్లు మిత్రులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలకు వివరించాలని సూచించారు. ఎస్పీ డీ.ఉదయ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ సైబర్ అంబాసిడర్లు యూనిఫామ్ లేని పోలీసులు అని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ నేరస్తుల చేతిలో మోసపోతే వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నంబర్ 1930ని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వారిలో ఎన్. దీపిక జడ్పీహెచ్ఎస్(కూర, జైనథ్), ఈ.సుధీర్, జడ్పీహెచ్ఎస్, బరంపూర్, తలమడుగు, జాహ్నవి, కేజీబీవీ సిరికొండ ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎస్.శ్రీనివాసరావు, సీ.సమయిజాన్రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఈవో ప్రణీత, షీటీం ఇన్చార్జి సునీత తదితరులు పాల్గొన్నారు.