ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 9: ప్రతి ఒక్కరిలో జాతీయ భావం మేల్కొల్పడానికి కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని కేసీబీ గార్డెన్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఎస్పీ ఉదయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో ఈనెల 13 నుంచి 15 వరకు జాతీయ జెండాలను ప్రతి ఇంటిపై ఎగురవేయడానికి జిల్లాకు సుమారు 2.02లక్షల పతాకాలను ప్రభుత్వం పంపించినట్లు తెలిపారు. వీటన్నింటినీ ఈ నెల 13లోగా పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఈనెల 8 నుంచి 22 వరకు జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక, క్రీడా, ఇతర కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఆగస్టు 9 : స్వతంత్ర భారతదేశంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో మంగళవారం స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈనెల 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీ య జెండాల పంపిణీని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాల మేరకు వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం
ఎదులాపురం,ఆగస్టు9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని మూడు థియేటర్లలో మంగళవారం గాంధీ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. మహేశ్వరీ థియేటర్లో గాంధీ సినిమాను ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. చిన్నారులతో కలిసి అతిథులు సినిమాను తిలకించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయవాదం పెంపొందించే దిశగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులందరికీ ఈ సినిమా చూపించనున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ తరఫున పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ నెల 16న జిల్లా వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫ్రీడం రన్లో సైతం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, డీఎస్పీ ఉమేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ ఉన్నారు.
వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలి
నిర్మల్ అర్బన్, ఆగస్టు 9 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మేల్కొనేలా వైభవంగా వేడుకలు నిర్వహించాలని నిర్మల్ ఎస్పీప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో మంగళవారం ఆయన మాట్లాడారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండా, ప్రతి ఒక్కరి గుండెల్లో భారతీయత నింపేలా భారత వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. ఈనెల 8 నుంచి 22 వరకు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ సమైక్యత, దేశ భక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆగస్టు 15న హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 16న ఉదయం 11గంటలకు జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, సర్పంచ్, పోలీస్ అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పారు. ఎక్కడి వారు అక్కడే సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 11న జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో ఫ్రీడం వాక్ నిర్వహింనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, పట్టణ సీఐ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మహేశ్, ఆర్ఐలు రమేశ్, రామకృష్ణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మహనీయుల చరిత్రను తెలుసుకోవాలి
విద్యార్థులు మహనీయుల చరిత్రను తెలుసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్లోని మూడు థియేటర్లలో ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 6 నుంచి పదోతరగతి విద్యార్థుల కోసం జిల్లాలోని నాలుగు థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9-11 వరకు, 16 నుంచి 21వరకు మొత్తం 25815 మంది విద్యార్థులకు సినిమాను చూపించనున్నట్లు వివరించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఈవో రవీందర్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి శ్రీదేవి తదితరులున్నారు.
ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలి
సోన్, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి కోరారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్లో జాతీయ జెండాలను పంపిణీని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్కుమార్, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, సర్పంచ్ నవాత్ గంగాధర్, గ్రామస్తులు ఉన్నారు.