ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా కొనసాగాయి. ఆదివాసీ గిరిజన గ్రామాలు, పల్లెలు, గూడేలలో ఘనంగా జరుపుకున్నారు. మొదటగా జెండా ఆవిష్కరించి.. కుమ్రం భీం, రాంజీ గోండు విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ మహిళలు, పురుషులు వేర్వేరుగా నృత్యాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేబీ ప్రాంగణంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, మాజీ ఎంపీ నగేశ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివాసులతో కలిసి నృత్యం చేశారు.
ఉట్నూర్, ఆగస్టు 9 : ఆదివాసీ గిరిజనులకు ఎల్లవేళలా అండగా ఉం టామని, కనకరాజుకు పద్మశ్రీ రావడం జిల్లాకే గర్వకారణమని, గుస్సాడీ నేర్పించడానికి పాఠశాల ప్రారంభిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావుతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో కలెక్టర్కు స్వాగతం ఫలికారు. ఈ సందర్భంగా కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసుల పిల్లలకు విద్యా, వైద్యం అందించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.
ఇందులో భాగంగానే ఉపాధ్యాయులకు ఆంగ్లంపై పట్టు కోసం శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులకూ స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పించే ఆలోచనతో ముందుకు సాగుతున్నామన్నారు. మలేరియా, డయేరియా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదని, ఐటీడీఏ అధికారులు, వైద్య సిబ్బంది కృషి ప్రశంసనీయమని పొగిడారు. వరదల కారణంగా గర్భిణులకు ఇబ్బందులు తలెత్తకుండా వెయిటింగ్ రూంలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం రెండు వారాలు ప్రత్యేక జెండా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు స్క్రీన్ల ద్వారా గాంధీ ఫిలిం చూపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, మాజీ ఎంపీ నగేశ్, ఎంపీపీ జైవంత్రావు, జిల్లా సర్మేడీ మెస్రం దుర్గు, వెడ్మ బొజ్జు, డీడీ దిలీప్, సీఐ సైదారావు, ఎస్ఐ, గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి..
గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మంగళవారం కేబీలోని కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.