ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయమే మహిళలు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుట్టల్లో పాలు పోసి బెల్లం, ప్యాలాలు, పుట్నాలు, చక్కెరతో నైవేద్యాలు సమర్పించారు. సల్లంగా చూడు నాగమ్మ తల్లీ అని వేడుకున్నారు. కెస్లాపూర్ నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్మల్లో మంత్రి అల్లోల, ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక పూజలు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు వైభవంగా కొనసాగాయి. మంగళవారం ఉదయమే మహిళలు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు పరిధి, శివారులో ఉన్న పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. చల్లంగా చూడు నాగమ్మ తల్లీ అని వేడుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల నాగదేవత ఆలయంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పూజలు చేశారు. పుట్ట వద్ద పాలు పోశారు.
అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గానగర్ శ్రీ నవశక్తి దుర్గామాతను ఎమ్మెల్యే జోగు రామన్న దర్శించుకున్నారు. అక్కడే ఉన్న పాముల పుట్ట వద్ద పాలు పోసి పూజలు చేశారు. నార్నూర్ మండలంలోని చోర్గావ్లోని రాంమూర్తి ఆలయంలో జడ్పీ చైర్మన్ దంపతులు రాథోడ్ జనార్దన్-కవిత మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మధురల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గాదిగూడ మండలంలోని లోకారి-కేలో నాగదేవత ప్రత్యక్షం కావడంతో భక్తులు పరవశించి పోయారు. నాగపంచమి రోజున నాగుపాము దర్శనమివ్వడం శుభదినమని పెద్దలు పేర్కొన్నారు. నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. నాగోబాను పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి దర్శించుకున్నారు.