నిర్మల్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఆరు మండలాల రైతులకు జల ప్రదాయినిగా వర్ధిల్లుతున్న సరస్వతి కాల్వ ద్వారా వానకాలం సీజన్లో సాగునీటి విడుదల ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి కాల్వ ద్వారా నిర్మల్ మండలంతోపాటు సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లోని దాదాపు 30వేల ఎకరాలకు నీరందనున్నది. ఈ సీజన్ కోసం ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాల్వ ద్వారా 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సరస్వతి కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద పూజలు చేసి నీటిని విడుదల చేశారు.
ఏటా వానకాలం, యాసంగిలో సరస్వతి కాల్వ ద్వారా దాదాపు 30వేల ఎకరాలకు నీరందుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మి కాల్వలతోపాటు సరస్వతి కాల్వకు సైతం అధికారులు నీటిని కేటాయిస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ నీటి కోటా కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే మొన్నటి వరకు భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. ప్రవాహం పెరుగడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. అయితే ప్రాజెక్టు ద్వారా మూడు ప్రధాన కాల్వల పరిధిలో రెండు పంటలకు అవసరమైన సాగు నీటిని నిల్వ చేశారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటి విడుదలను ప్రారంభించారు. సరస్వతి కాల్వ ద్వారా ఆయా మండలాల్లోని 64 చెరువులను నింపనున్నారు. 28డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఆయకట్టుకు నీరందనున్నది.
64చెరువులకు జలకళ…
సరస్వతి కాల్వ పరిధిలోని 64 చెరువులు నింపి 28 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సాగు నీరందించనున్నారు. ఇప్పటికే రైతులు సరస్వతి కాల్వ పరిధిలో పంటల సాగు ప్రారంభించారు. వర్షాల కారణంగా కొన్ని చోట్ల పంటలకు నష్టం జరిగినప్పటికీ ఆ నష్టాన్ని అధిగమించి మళ్లీ సాగు పనులు మొదలు పెట్టారు. ముఖ్యంగా వరితో పాటు పసుపు, మొక్కజొన్న వేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
యాసంగి సీజన్పై ముందుచూపు…
వానకాలం సాగుకు నీరు ఆశించిన మేరకు అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు యాసంగి సీజన్ను కూడా పరిగణలోకి తీసుకుని నీటి విడుదలకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లో ఏటా వానకాలం, యాసంగి సీజన్ ముగిసే నాటికి చివరి ఆయకట్టు వరకు నీరు అందక పోవడం వల్ల అక్కడి రైతాంగం ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పుష్కలంగా నీరు…
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సరస్వతి కాల్వ ఆయకట్టుకు అవసరమైన మేరకు సాగునీరందిస్తాం. వానకాలం సీజన్ ముగిసే వరకు పంటలకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆయా మండలాల్లోని 64 చెరువులతోపాటు, 28 డిస్ట్రిబ్యూటరీలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– రామారావు, జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ, నిర్మల్