తెలంగాణ సర్కారు వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. గ్రామస్థాయిలోని సబ్ సెంటర్ మొదలుకొని జిల్లా దవాఖాన వరకు పరికరాలు అందుబాటులో ఉంచుతూ.. మెరుగైన వైద్యం అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాకాలం వచ్చిందంటే గర్భిణులు నరకం అనుభవించేవారు. వాగులు, వంకలు ఉప్పొంగితే కష్టాలు పడేవారు. కొన్ని సార్లు మార్గం మధ్యలోనే ప్రసవాలు అయిన సందర్భాలు అనేకం. ఇటువంటి గ్రామాలను ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 57 గుర్తించారు. ఈ పల్లెల నుంచి గర్భిణులను ప్రసవానికి పక్షం రోజుల ముందే జిల్లా, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బర్త్ వెయింటింగ్ రూంలలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. వీరిని కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రసవానంతరం ఇంటికి చేరుస్తున్నారు.
ఆదిలాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావాసులు వైద్యపరంగా చాలా అవస్థలు పడాల్సి వచ్చేది. సీజనల్ వ్యాధులతో ఏజెన్సీ గ్రామాలు మంచం పట్టేవి. సరైన వైద్యం అందక మలేరి యా, టైఫాయిడ్, డయేరియా, డెంగీ వంటి వ్యా ధులతో మరణాలు సంభవించేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వైద్యసేవలను మె రుగు పర్చింది. ఆదిలాబాద్ జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. సబ్ సెంటర్స్లోని వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వై ద్యం అందిస్తున్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య కోసం జిల్లా దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. కరోనాకు కూడా పీ హెచ్సీల్లో వైద్యం అందుతుండగా.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవల కారణంగా సర్కారు దవాఖానలకు రోగుల సంఖ్య పెరుగుతోంది. మారుమూల గ్రామాలతోపాటు ఆదివాసీ గూడేల్లోని గ ర్భిణులు సర్కారు దవాఖానల్లోనే ప్రసవం అ య్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాలు తల్లీబిడ్డలకు వరంగా మారాయి.
గర్భిణులకు ప్రయాణ బాధలు దూరం
ఆదిలాబాద్ జిల్లాలో యేటా వానకాలంలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 57 వర్ష ప్రభావిత గ్రామాలను గుర్తించిన అధికారులు ఆయా గ్రా మాల గర్భిణులు ప్రసవం సమయంలో రవాణా పరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లోని 30 గ్రామాలు, ఉట్నూర్ డివిజన్లోని 27 గ్రామాల్లో ని గర్భిణులు ప్రసవ సమయంలో రవాణాపరమైన అవస్థలు పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
పల్లెలకు సమీపంలో ఉన్న జిల్లా, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బర్త్ వెయింటింగ్ రూంలలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. గ్రామాల పరిధిలోని పీహెచ్సీ వైద్యులు, సిబ్బం ది, ఏఎన్ఎంల ద్వారా గర్భిణీ కుటుంబసభ్యులకు నచ్చిచెప్పి 102, ఇతర వాహనాల ద్వారా దవాఖానలకు తీసుకొస్తున్నారు. వీరికి సహాయంగా కుటుంబసభ్యులు ఉంటున్నారు. గర్భిణులకు పరీక్షలు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. దవాఖానలు, బర్త్ వెయిటింగ్ రూంలలో వారికి భోజనంతోపాటు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రసవానంతరం వారికి కేసీఆర్ కిట్, మందులు అందజేసి వాహనాల్లో ఇంటివద్ద దించుతామని వైద్యాధికారులు తెలిపారు. వర్ష ప్ర భావిత ప్రాంతాల్లో రవాణా పరమైన ఇబ్బందులు లేకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలపై ప్ర జలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముందుగానే తీసుకొస్తున్నాం..
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి 57 గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాల్లోని గర్భిణులను ముందుగానే దవాఖానలకు తరలించాం. వైద్యుల పర్యవేక్షణలో వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నాం. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలకు కేసీఆర్ కిట్, ఇతర మందులు ఇచ్చి క్షేమంగా ఇంటికి పంపిస్తున్నాం.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్
పర్యవేక్షణలో ఉంచుతాం..
ఏజెన్సీ పరిధిలో చాలావరకు మారుమూల గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలం గర్భిణులను డెలివరీ కోసం దవాఖానకు వాగులు, వంకలు దాటించి తీసుకురావడం కష్టమవుతున్నది. అందుకే ప్రసవానికి పక్షం రోజుల ముందే బర్త్ వెయిటింగ్ రూంలకు తరలించి, నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నాం. పల్లి పట్టి, బెల్లం, పాలు, ఇప్పలడ్డు వంటి పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రసవం అనంతరం ఇంటికి చేర్చుతున్నాం.
– ఉపేందర్, సీహెచ్సీ సూపరింటెండెంట్, ఉట్నూర్