బాసర, ఆగస్టు 1: సరస్వతీ అమ్మవారు కొలువు దీరిన బాసరలోని ట్రిపుల్ ఐటీ తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్నది. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న పేద విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నది. ఏటా వందలాది మంది ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటుండగా, క్యాంపస్ రిక్రూట్మెంట్లలో అత్యధిక శాతం ప్లేస్మెంట్ లభిస్తున్నది. 2021-22 సంవత్సరంలో 82.37 శాతం మంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా కొందరు తమ అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
సరస్వతీ అమ్మవారు కొలువు దీరిన బాసరలోని ట్రిపుల్ ఐటీ తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్నది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధిస్తూ ట్రిపుల్ ఐటీ కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్నారు. ట్రిపుల్ఐటీని 2008లో స్థాపించగా, 2014లో మొదటి బ్యాచ్ విద్యార్థులు చదువు పూర్తిచేసుకొని బయటకు వచ్చారు. అదే సంవత్సరం తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి రాగా, ప్లేస్మెంట్లు, క్యాంపస్ ప్లేస్మెంట్లు ప్రారంభమయ్యాయి. 2014 నుంచి 2022 వరకు 8 బ్యాచ్లకు చెందిన అనేక మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
సీఎస్పీ, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఎంఎంఈ విభాగాలు గల విద్యార్థులు ప్రముఖ కంపెనీలైన టెక్ మహీంద్ర, ఐబీఎం, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ, వే-2 ఆన్లైన్, ఎల్అండ్టీ, థాట్వర్స్, జేఎస్డబ్ల్యూ, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, సేతూసర్వ్వంటి వాటిలోఉద్యోగాలు సాధించి ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక టీఎస్పీఎస్ ద్వారా ఇప్పటికే కొందరు టీఎస్ జెన్కో, మిషన్ భగీరథ, ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ డిపార్టుమెంట్లలో ఉద్యోగాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో 2021-22లో ఉద్యోగాలు సాధించిన పలువురు విద్యార్థులను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా, తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మరిన్ని కంపెనీలువచ్చేలా కృషి
ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు సెలవుల అనంతరం ట్రిపుల్ ఐటీకి వస్తున్నారు. వీరికి నేటి నుంచి ప్రాంగణ నియామకాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, మెళుకువలను నేర్పేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి విభాగానికీ ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్లను నియమించాం. అంతేగాకుండా ప్లేస్మెంట్ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్తో పాటు కింది స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు విద్యార్థులతో ప్లేస్మెంట్ భవనంలో కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించాను. మంత్రి కేటీఆర్తో చర్చించి ప్రస్తుతం వచ్చే కంపెనీలే కాకుండా మరిన్ని సాప్ట్వేర్ కంపెనీలు బాసర ట్రిపుల్ఐటీకి వచ్చే విధంగా కృషి చేస్తున్నాం. ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులందరూ గ్రామీణ, పేద విద్యార్థులే. ఇక్కడ చదివిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.
– వెంకటరమణ, ట్రిపుల్ ఐటీఇన్చార్జి వైస్చాన్స్లర్
చిన్నప్పటి నుంచి సాప్ట్వేర్ అంటే మక్కువ
నాన్న ఎలక్ట్రిషియన్. ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. కాగజ్నగర్లోని నవోదయలో చదివిన. పదో తరగతిలో పది జీపీఏ వచ్చింది. ట్రిఫుల్ ఐటీలో సీటు సాధించాను. చిన్నప్పటి నుంచి నాకు సాప్ట్వేర్ రంగం అంటే మక్కువ. ప్రస్తుతం నాకు ఏడీజెడ్వోఐఎన్టీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నా వార్షిక వేతనం రూ. 5 లక్షలు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ కంపెనీ ఉంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరుతా. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఙతలు.
– సుక్రిత, సీఎస్సీ, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా
ట్రైనింగ్లో ఉన్నా..
అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. ట్రిఫుల్ ఐటీలో చేరి ట్రిఫుల్ ఈ పూర్తి చేసిన. నాకు సేతుసర్వ్ కంపెనీలో ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్న. త్వరలోనే హైదరాబాద్లో ఉద్యోగంలో చేరుతా. వ్యవసాయం నుంచి సాఫ్ట్వేర్లోకి రావడం ట్రిపుల్ ఐటీ ద్వారానే సాధ్యమైంది.
– కావ్యశ్రీ, ట్రిపుల్ఈ, అక్కంపేట్, వరంగల్ జిల్లా
ట్రిఫుల్ ఐటీ సిబ్బందికి రుణపడి ఉంటా
మా నాన్న సత్తయ్య, అమ్మ సంధ్య. నాన్న గీత కార్మికుడిగా పనిచేస్తూ నన్ను చదివించాడు. మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పాస్ అయ్యాను. 10కి 10 జీపీఏ సాధించాను. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. ప్రస్తుతం క్యాప్జెమినీలో రూ. 4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్న. నా చెల్లెలు కూడా ఇక్కడే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుంది. నా ఎదుగుదలకు సహకరించిన ట్రిపుల్ ఐటీ సిబ్బందికి రుణపడి ఉంటాను.
– స్వాతి, కెమికల్ ఇంజనీరింగ్, నిమ్మపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లా
ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది
నాన్న రామరాజు వ్యవసాయం చేస్తూ నన్ను చదివించాడు. కష్టపడి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించా. ల్యాబ్లోని పరికరాల వినియోగంలో అధ్యాపకులు మాకు మెళుకువలు నేర్పించారు. ఇటీవల పలు కంపెనీలు వచ్చాయి. ఇంటర్వ్యూలో పాల్గొన్న. నాకు జేఎస్డబ్ల్యూ కంపెనీలో ఏడాదికి రూ. 5.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 10న కర్ణాటకలోని బల్లారిలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది.
– గల్ల అశ్విని, ఎంఎంఈ, అమీర్పేట్, రంగారెడ్డి జిల్లా
ఉద్యోగంలో చేరిన
నాన్న కమలాకర్ ప్రైవేట్ హోటల్లో క్యాషియర్గా పని చేస్తూ నన్ను, మా అన్నయ్యను చదివించారు. అన్నయ్య ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నాకు ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఫోర్ఫేస్లో జాబ్ వచ్చింది. ఏడాదికి రూ. 8లక్షల వేతనం. ఆగస్టు 1న ఉద్యోగంలో చేరాను. ట్రిపుల్ ఐటీలో చదువుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు తమకు కమ్యూనికేషన్ స్కీల్స్ పెంచేందుకు తోడ్పడ్డారు.
– ప్రీతి, ఈసీఈ, వల్లపట్ల, సిద్దిపేట్ జిల్లా