లక్ష్మణచాంద, జూలై 31 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పొట్టపెల్లి(కే) గ్రామంలో కార్డెన్సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని కారు, ఆటో, 104 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు అన్ని పత్రాలను కలిగి ఉండాలని, ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పుల్వాజీ హైమావతి, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్ఐలు రాహుల్, అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కుంటాల మండలంలో..
నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం కుంటాల మండలం లింబా (బీ) గ్రామంలో నిర్బంధ తనిఖీలను చేపట్టి 62 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలు, 3 ఫోర్వీలర్ వాహనాలతో పాటు 800 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించేవారి సమాచారాన్ని అందజేయాలని కోరారు. సర్పంచ్ మల్లేశ్, ఎస్ఐలు సుమాంజలి, షరీఫ్, శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.