బజార్హత్నూర్, జూలై 25: గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పం పటిష్టంగా అమలవుతున్నది. అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ కార్మికులు నిత్యం పరిసరాలు శుభ్రంగా ఉంచుతున్నారు. సేకరించిన చెత్తాచెదారం పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా డంప్యార్డుకు తరలిస్తూ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. గతంతో పోలిస్తే ప్రజల భాగస్వామ్యం పెరిగింది. ప్రభుత్వం ప్రతి వెయ్యి మంది జనాభాకో ఒక పారిశుధ్య కార్మికుడిని పంచాయతీలో నియమించింది. ప్రతి ఒక్కరికీ పంచాయతీ ద్వారా ప్రతి నెలా గౌరవ వేతనం అందిస్తున్నది. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ పారిశుధ్య పనులతో పాటు డ్రైనేజీ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
పారిశుధ్య పనులపై దృష్టి
గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీ సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. కార్మికులు చేస్తున్న పనులను నిత్యం కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి కార్మికులు చెత్తసేకరిస్తుండడంతో స్వచ్ఛ గ్రామాలుగా మారుతున్నాయి
-రాథోడ్ రాధ, ఎంపీడీవో, బజార్హత్నూర్
చెత్తసేకరణపై ప్రత్యేక శ్రద్ధ
ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు గ్రామంలో చెత్త తొలగించి పరిసరాల శుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులు చేపడుతున్న పారిశుధ్య పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. గ్రామాల్లో సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నాం.
-శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, ధరంపూర్
పక్కాగా అమలు
గ్రామాల్లో చెత్తసేకరణ పక్కాగా అమలవుతున్నది. పంచాయతీ కార్మికులు చెత్తను సేకరించి డంప్ యార్డులో వర్మీకంపోస్టు ఎరువుల తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ పరిసరాలను కార్మికులు శుభ్రం చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో శుభ్రత కనిపిస్తున్నది.
-తడక దయాకర్, బజార్హత్నూర్, గ్రామవాసి