ఆదిలాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మళ్లీ వరుణుడు విరుచుకుపడ్డాడు. వారం తిరక్కముందే శనివారం కుండపోత వర్షం కురిపించాడు. శాంతించాడని భావించగా.. ఒక్కసారి తన ప్రతాపం చూపించాడు. ఏకధాటిగా కురియడంతో భారీనష్టం వాటిల్లింది. చేలలో నీరు నిలిచింది. రహదారులు, కల్వర్టులపై వరద ఉధృతంగా పారుతుండంతో జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. సాగు నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పరిస్థితిపై శనివారం మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని సీఎం కేసీఆర్ ఫోన్లో ఆరా తీశారు. పరిస్థితిని సమీక్షించాలని.. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. హెలీప్యాడ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జైనథ్ మండలంలోని సాత్నాల, తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నది. రెండు ప్రాజెక్టులు ఇటీవల కురిసిన వర్షాలతో గరిష్ఠ నీటిమట్టానికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 3,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో రెండు గేట్లు ఎత్తిన అధికారులు 3,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
మత్తడి ప్రాజెక్టులోకి 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఒక గేటు ద్వారా 455 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదలు చేశారు. నేరడిగొండ మండలం కుంటాల, కొరిటికల్.. బోథ్ మండలం పొచ్చెర జలపాతాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో జలకళను సంతరించుకున్నాయి. నేడు(ఆదివారం) కూడా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలుండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా సగటు వర్షపాతం 34.2 మిల్లీ మీటర్లు నమోదు కాగా.. అత్యధికంగా మావల మండలంలో 60.2 మిల్లీ మీటర్ల వర్షం పడింది.జిల్లాలో సీజన్లో శనివారం వరకు 452.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 941.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. సాధారణం కంటే రెండింతలు ఎక్కువ నమోదు కావడంతో సాగునీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రాకపోకలు నిలిచాయి. పత్తి, సోయా, వరి వంటి పంటలు నీట మునిగాయి. ఖానాపూర్లో అత్యధికంగా 99 మిల్లీ మీటర్లు కురిసింది. నిర్మల్-మంచిర్యాల రహదారిపై రెండు చోట్ల అప్రోచ్ రోడ్లు కొట్టుకుపోయాయి. నిర్మల్-ఖానాపూర్ రహదారి విస్తరణ పనులు జరుగుతుండడంతో పలు చోట్ల పాత వంతెనలను తొలిగించి వాటి స్థానంలో కొత్త వంతెనల నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో ఆయా వంతెనల వద్ద తాత్కాలికంగా రాకపోకల కోసం అప్రోచ్ రోడ్లను ఏర్పాటు చేశారు.
ఇవీ కొట్టుకపోగా.. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచాయి. అలాగే లక్ష్మణచాంద నుంచి తిరుపెల్లి వెళ్లే దారిలో వాగుపై నుంచి మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. సారంగాపూర్ మండలంలో జాం చెరువు నిండి అలుగు పోస్తుండడంతో ఆ నీరంతా సారంగాపూర్ ప్రధాన రోడ్డుపైకి చేరింది. ఫలితంగా లో-లెవెల్ వంతెన నీట మునిగింది. మామడ మండలం కొరిటికల్లోని దుర్గానగర్ ప్రాంతంలో దాదాపు 20 ఇండ్లలోకి నీరు చేరింది. భైంసా పట్టణంలోని రాహుల్ నగర్, ఆటోనగర్ కాలనీలు జలమయమయ్యాయి. ఖానాపూర్ పట్టణంలోని జేకే నగర్, విద్యానగర్, సుభాష్నగర్, మదీనకాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.
ఖానాపూర్-తర్లపాడ్, ఖానాపూర్-దిలావర్పూర్ గ్రామాల మధ్య రెంకోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా రూట్లలో వాహనాలను అనుమతించడం లేదు. ఖానాపూర్ మండలంలోని రాజూర చెరువుకు గండి పడడంతో బావాపూర్ వాగుపై నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. కుంటాల, లోకేశ్వరం మండలాల్లోని పత్తి, సోయా, వరి పంటలు నీట మునిగాయి. ప్రస్తుతం స్వర్ణ ప్రాజెక్టు ఇన్ఫ్లో 14 వేల క్యూసెక్కులు ఉండగా, రెండు గేట్లను ఎత్తి 18 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 35,506 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 8,298 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, రెండు గేట్లు ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా.. శనివారం జిల్లా సగటు వర్షపాతం 24.6 మిల్లీమీటర్లు ఉండగా.. అత్యధికంగా ఖానాపూర్ మండలంలో 99 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు శనివారం మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మరో 24 గంటలపాటు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైన చోట యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. హెలీఫ్యాడ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.