తిర్యాణి,జూలై 23 : విధులను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హెచ్చరించారు. మండలంలోని జడ్పీ, గురుకులం, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలతో పాటు 30 పడకల దవాఖాన, ఎంపీడీవో కార్యాలయాన్ని శనివారం ఆమె సందర్శించారు. ముందుగా గురుకుల పాఠశాలను తనిఖీ చేసి ఆవరణ మొత్తం కలియ తిరిగారు. రికార్డులు పరిశీలించారు. అందుబాటులో లేని సిబ్బంది పేరిట సెలవు పత్రాలు రాసి సంతకాలు చేయడంపై ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నుంచి వృథాగా పోతున్న నీరును గమనించి అసహనం వ్యక్తం చేశారు. అలాగే కిచెన్, ఆహార పదార్థాలు, స్టోర్ రూంలోని వస్తువులను పరిశీలించారు. కాజు, కిస్మిస్, బాదం వంటి వస్తువులు ఎందుకు తక్కువగా ఉన్నాయని వార్డెన్ను ప్రశ్నించారు.
విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టకపోవడంపై వార్డెన్, ప్రిన్సిపాల్పై మండిపడ్డారు. మెనూ పాటించడం లేదని నిలదీశారు. ఇక మీదట విద్యార్థులకు క్రమం తప్పకుండా పోషకాహారం అందించడంతో పాటు మెరుగైన విద్యను అందించాలని ఆదేశించారు.అనంతరం మండలకేంద్రంలోని దవాఖానను సందర్శించారు. వైద్యాధికారి సౌమ్య తప్ప ఎవ్వరూ లేకపోడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులు, ఇతర గదులను పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మండలకేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి హెచ్ఎం షేక్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన కర్ణు, రాజ్యలక్ష్మి, శేఖర్ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అనంతరం జడ్పీ పాఠశాలలో రికార్డులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఆంగ్లంలో పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. శానిటేషన్ వివరాలను అధికారులు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించని, తరచూ విధులకు డుమ్మా కొడుతున్న అలాగే అందుబాటులో లేని ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా మొదటిసారిగా మండలాన్ని సందర్శించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆత్రం చంద్ర శేఖర్, ఎంపీవో జావెద్, తిర్యాణి, చింతపల్లి సర్పంచ్లు కొర్వేత సింధుజ, ఆత్రం రుక్మిణి, ఉప సర్పంచ్ తోట లచ్చన్న ఉన్నారు.