ఎదులాపురం, జూలై 20: జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలతో దోమల వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నిరంతరం డ్రైడే కార్యక్రమాలు కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ , వైద్య, వార్డు ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో డ్రైడే, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేయాలన్నారు.
సమీక్షా సమావేశాలకు హాజరు కాని వారికి మెమోలు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రతి బుధవారం ఉదయం 11 గంటలకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలు , గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పర్యవేక్షించాలన్నారు. హరితహారం కింద ఇంటింటికీ ఆరు మొక్కలను సోమవారం నుంచి పంపిణీ చేయాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ… క్షేత్ర సిబ్బంది పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి, వ్యాధులను జీరో స్థాయికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు జిల్లా వైద్యాధికారి సాధన, జిల్లా మలేరియా అధికారి మెట్పెల్లివార్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది, ప్రత్యేకాధికారులు, ఆర్పీలు ఉన్నారు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంక్షేమాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య ,పంచాయతీ రాజ్, విద్యుత్శాఖ అధికారులతో కలిసి సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 22 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో అడ్మిషన్ కోసం ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి సంక్షేమాధికారి 17 రిజిసర్లను తప్పని సరిగా నిర్వహించాలన్నారు. కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలను సంబంధిత తహసీల్ నుంచి పొందాన్నారు. సమావేశంలో డీఎస్సీడీవో సునీతాకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, డీఈవో ప్రణీత ,లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, వసతి గృహాల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
రుణాలు అందించడంలో బ్యాంకులు సహకరించాలి
జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడంలో బ్యాంకులు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన వివిధ బ్యాంకు మేనేజర్లకు సెర్ప్ ఆధ్వర్యంలో ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… జాతీయ గ్రామీణ స్వయం ఉపాధి, బ్యాంకు లింకేజీల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందించడంలో బ్యాంకులు సహకరించాలన్నారు. జిల్లాలో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో 70 బ్యాంకులకు సంబంధించిన బ్యాంకు మేనేజర్లకు సెర్ప్ అధికారులు వారి సలహాలు అందించారు. సెర్ప్ శిక్షణ అధికారులు రవీందర్రావు, వెంకట్స్వామి బ్యాంకర్లకు రుణాలు మంజూరు విషయంలో పలు విషయాలను వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ అధికారి కిషన్, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లాలకు చెందిన ఆయా బ్యాంకుల మేనేజర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.