నిర్మల్ అర్బన్, జూలై 8 : గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్, ఇచ్చోడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. పేద ల పక్షపాతి అంటూ ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని టీఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ముడుసు సత్యనారాయణ అన్నారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. నల్ల జెండాలు, ఖాళీ సిలిండర్లతో మహిళలు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. బీజేపీ రోజు రోజుకూ గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నదని మండిపడ్డారు.
2014లో రూ.410 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ. 1105కు పెంచిందన్నారు. టీఆర్ఎస్ పేదల పక్షా న నిలుస్తున్నదన్నారు. బీజేపీ అంబానీ, అదానీల ఆస్తులు పెంచేందుకు పెద్దల పక్షాన నిలుస్తున్నదని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు మనుగడ సాధించవని, రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కేంద్రం మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గండ్రత్ రమణ, ఎస్పీ రాజు, పూదరి రాజేశ్వర్, లక్కాకుల నరహరి, సలీం, అన్వర్ పాషా, చాహుష్, నాయకులు పద్మాకర్, జగడం రాజు, రామకృష్ణ, నర్సాగౌడ్, రఫీ, ఖాజా ముజాహోద్దీన్,నజీరొద్దీన్, సల్మాన్, సయ్యద్ ముషీరొద్దీన్, రాఘవేందర్, పోశెట్టి, లక్ష్మీనారాయణ, గండ్రత్ రమేశ్, నర్సయ్య, అంగ జగదీశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూలై 8 : సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. కేంద్రం ప్రభుత్వం తీరును నిరసిస్తూ శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఇచ్చోడలో తహసీల్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల బతుకులను కేంద్రం ఆగమాగం చేస్తున్నదన్నారు. బడా వ్యాపారులకు పెద్ద పీట వేస్తూ, మధ్యతరగతి కుటుంబాల ప్రజల నడ్డి విరుస్తున్నదని ధ్వజమెత్తారు. సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ నినదించారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సుద్దావార్ వెంకటేశ్, ఎస్సీ సెల్ నాయకులు గైక్వాడ్ గణేశ్, ఆశన్న, గ్యాతం గంగయ్య, నర్వాటే ఈశ్వర్, ప్రకాశ్, సాయి రెడ్డి, భీముడు, శంకర్ పాల్గొన్నారు.