ఎదులాపురం, జూలై 2 : తెలంగాణ సర్కారు వైద్యరంగంలో అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గర్భిణులను తరలించడానికి అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ కిట్టు, నగదు ప్రోత్సాహం వంటి వాటితో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రధానంగా ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, వైద్యులు సాధారణ ప్రసవాలపై క్షేత్రస్థాయిలో గర్భిణులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో సర్కారు దవాఖానలకు వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్(సీహెచ్సీ),రిమ్స్ ఉన్నాయి. వీటిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8,825 ప్రసవాలు జరిగాయి.
రిమ్స్లో 5,525 ప్రసవాలు జరగ్గా.. ఇందులో 3,076 సాధారణ.. 2,451 సిజేరియన్లు అయ్యాయి. బోథ్ సీహెచ్సీలో 11 సిజేరియన్లు కాగా.. మిగిలిన 22 పీహెచ్సీలలో 3,298 వంద శాతం సాధారణ ప్రసవాలు జరగడం విశేషం. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో గడిచిన సంవత్సరంలో 4,505 ప్రసవాలు జరగగా.. ఇందులో 625 సాధారణ, 3,880 ఆపరేషన్లు అయ్యాయి. ప్రైవేట్ దవాఖానల్లో 85 శాతం సిజేరియన్లు, 15 శాతం మాత్రమే సాధారణ ప్రసవాలు అవుతున్నాయి. కానీ.. ప్రభుత్వ దవాఖానల్లో 66 శాతం వరకు సాధారణ ప్రసవాలు అవుతుండగా.. పీహెచ్సీలలో వంద శాతం సాధారణ ప్రసవాలు అవుతున్నాయి. అలాగే 108 వాహనం, ఇండ్లలో రెండు శాతం అవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రైవేట్ దవాఖానల్లో 85 సిజేరియన్లు..
ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ దవాఖానలు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించకుండానే డబ్బుల కోసం ఆపరేషన్లు చేస్తున్నాయి. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నా సిజేరియన్లు చేస్తున్నాయి. కొందరు కుటుంబ సభ్యులు తమ బిడ్డలు పురిటి నొప్పులు భరించపోవడంతో డబ్బులు తీసుకున్నా పరవాలేదు.. ఆపరేషన్ చేయండని చెబుతుండడం విశేషం. 17 నర్సింగ్ హోంలు ఉండగా.. ప్రతి దవాఖాన ఆవరణలో ప్రసవాల ధరల బోర్డులు దర్శనమిస్తాయి. ఏ దవాఖానలో అయితే తొలిసారి ఆపరేషన్ చేయించుకుంటారో.. రెండో కాన్పుకు కూడా అదే ఆస్పత్రికి పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆస్పత్రి వైద్యులు మొదటి కాన్పు రిపోర్టుల ఆధారంగా రెండోసారి ప్రసవాలు చేస్తారు. దీంతో రెండు ప్రసవాలకు కలిసి దాదాపు రూ.85వేల నుంచి ఒక లక్ష వరకు ఖర్చవుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి పీహెచ్సీ టాప్..
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వంద శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. 2021-22 సంవత్సరానికి గాను పీహెచ్సీలలో జరిగిన ప్రసవాలు ఇలా ఉన్నాయి. ఇంద్రవెల్లిలో 444, ఇచ్చోడలో 402, గుడిహత్నూర్లో 316, నార్నూర్లో 282, భీంపూర్లో 191, ఝారిలో 142, బేలలో 133, సొనాలలో 108, బజార్హత్నూర్లో 102.. అలాగే బోథ్ సీహెచ్సీలో 122, ఉట్నూర్ సీహెచ్సీలో 639లలో సాధారణ ప్రసవాలు జరిగాయి. మిగిలిన పీహెచ్సీలలో 100లోపు ఉన్నాయి.
సాధారణ కాన్పుల వల్ల ప్రయోజనాలు..
నార్మల్ డెలివరీ అయిన మహిళలు రెండు, మూడు రోజుల్లోనే తమ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి దుష్ఫరిణామాలు ఉండవు.
రెండో కాన్పుపై ప్రభావం ఉండదు.
గర్భసంచికి కూడా ఏ ప్రమాదం ఉండదు. గర్భాశయానికి వ్యాధులు సోకవు.
భవిష్యత్తులో రుగ్మతలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
సిజేరియన్స్ వల్ల దుష్పరిణామాలు..
గర్భిణీకి తొమ్మిదో నెల పడగానే గర్భసంచి బరువుగా అవుతుంది. మొదటి కాన్పు సమయంలో వేసిన కుట్లు విడిపోయే ప్రమాదం ఉంది.
గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కడుపునొప్పి వచ్చే చాన్స్ అధికం.
శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం అధికమయ్యే ప్రమాదం ఉంది. గర్భసంచి తొలిగించే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. విరోచనాల బారిన పడే అవకాశం లేకపోలేదు.
శస్త్ర చికిత్స సందర్భంగా గర్భసంచి పక్కనే ఉండే మూత్రాశయానికి కూడా ఇబ్బందులు కలుగవచ్చు. రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడొచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు.
దాదాపు ఆరు నెలలపాటు బరువైన పనులు చేయడానికి వీలులేని పరిస్థితి.