ఉట్నూర్, జూలై 2 : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలో శనివారం ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రతి విద్యార్థి ప్రణాళికతో చదివితే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చని తెలిపారు. గిరిజన గురుకులాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించిన బుగ్గారం విద్యార్థిని సుప్రియకు రూ.25వేల చెక్కు అందజేసి శాలువాతో సన్మానించారు. రాష్ట్రస్థాయిలో సీఈసీ విభాగంలో రెండో ర్యాంకు సాధించిన శివాని, ప్రేమలత, పదో తరగతిలో 10/10 సాధించిన ఇచ్చోడ విద్యార్థిని సుధారాణిని సన్మానించారు. ఏకలవ్య విద్యాసంస్థల్లో ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించిన మల్లేశ్కు రూ.25 వేల చెక్కు అందజేసి శాలువాతో సన్మానించారు. సరస్వతి, నేహ, పూజ, సంధ్య, అఖిలను సత్కరించారు. వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ప్రిన్సిపాళ్లను అభినందించారు. ఆర్సీవో గంగాధర్, డీడీ దిలీప్, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, గురుకులాల సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థినికి అభినందన..
నేరడిగొండ, జూలై 2 : మండలంలోని ఆశ్రమోన్నత బాలికల పాఠశాలలో చదివి పదో తరగతి ఫలితాల్లో నేరడిగొండకు చెందిన విద్యార్థిని పవార్ పావని 9.7 జీడీఏ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఉట్నూర్లో ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి విద్యార్థినికి ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. ఐటీడీఏ డీడీ దిలీప్కుమార్ పాల్గొన్నారు.
ఇచ్చోడ విద్యార్థులకు..
ఇచ్చోడ, జూలై 2: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతిలో వంద శాతం ఫలితాలు రావడంపై ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి అభినందించారు. ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ను శాలువాతో సన్మానించారు. పదిలో ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. రాబోయే పది పరీక్షల్లో ఇలాంటి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
వందశాతం ఫలితాలు రావడం గొప్ప
దస్తురాబాద్,జులై 2 : పదో తరగతిలో విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించడం గొప్ప విషయమని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, మండలంలోని మల్లాపూర్ గోండుగూడెంలో గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు చందులాల్, నందును పీవో అభినందించారు. వారికి ప్రశంసాప్రతాలు, జ్ఞాపికలు అందజేశారు. గిరిజన విద్యార్థులకు విద్య అందించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి మొదటిసారిగా విద్యార్థులు వందశాతం ఫలితాలు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతరంగా కృషి చేయాలని, విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని ఆయన సూచించారు.