నిర్మల్ టౌన్/తాంసి/తలమడుగు, జూన్ 29 :ఏ నాయకుడి ఊహకు అందని, తలపెట్టని పథకం.. చిన్న, సన్నకారు రైతులకు కొండంత అండగా నిలుస్తూ.. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే కాపీ కొట్టిన మహాద్భుత స్కీం రైతుబంధు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో అన్నదాత క్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటిది. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా రైతును రాజును చేయడమే ధ్యేయంగా ప్రవేశపెట్టగా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగలా మారగా.. స్వరాష్ట్రంలో పండుగలా మారింది. రైతన్నలు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. సీజన్కు ముందే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుండడంతో సంతోషంగా ‘సాగు’తున్నారు. ఈ వానకాలానికి సంబంధించి తొలి రోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,74,693 మంది రైతుల ఖాతాల్లో రూ.80.15 కోట్లు జమ కాగా.. రెండో రోజైన బుధవారం 2,64,978 మంది ఖాతాల్లో రూ.176.54 కోట్లు పడ్డాయి.
వానకాలం సీజన్కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం రెండో రోజైన బుధవారం రైతుల ఖాతాల్లో జమ అయింది. తొలి రోజైన మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో 11,333 మంది రైతులకు రూ.4.07 కోట్లు, నిర్మల్లో 85,953 మందికి రూ.46.59 కోట్లు, మంచిర్యాలలో 45,407 మందికి రూ.13.49 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 32వేల మందికి రూ.16 కోట్లు జమ అయ్యాయి. రెండో రోజైన బుధవారం కూడా సర్కారు డబ్బులు జమ చేసింది. మంచిర్యాల జిల్లాలో 81,817 మంది రైతుల ఖాతాల్లో రూ.40.87 కోట్లు, నిర్మల్ జిల్లాలో 1,19,050 మందికి రూ.87 కోట్లు, ఆదిలాబాద్లో 39,814 మంది రైతులకు రూ.29.46 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 24,297 మంది రైతులకు రూ.19.21 కోట్లు జమ అయ్యాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు
రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు బసార్కర్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కౌటాల సర్పంచ్ వొజ్జల మౌనిశ్, ఉప సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీలు మనీశ్, వసంత్రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బ్రహ్మయ్య, పార్టీ అధ్యక్షుడు వసంత్రావు, మాజీ ఎంపీపీ గంగారాం, యూత్ మండల అధ్యక్షుడు రవీందర్గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని సుంకిడి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోక జీవన్రెడ్డి, మండల కన్వీనర్ తోట వెంకటేశ్, సర్పంచ్ గెల్ల మహేందర్ యాదవ్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
పెట్టుబడి సాయంతో ఆసరా
మాది దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామం. 25 ఏండ్లుగా ఎవుసాన్ని నమ్ముకొని మా కుటుంబం బతుకుతున్నది. గతంలో ఉన్న నాయకులెవరూ రైతులను పట్టించుకోలే. ఎరువులు కావాలంటే 10 కిమీ దూరంల ఉన్న దండేపల్లికి వెళ్లి లైన్లో ఉండాల్సి వచ్చేది. టీఆర్ఎస్ సర్కారు వచ్చినంక పరిస్థితులు మారినయ్. ఎవుసానికి 24 గంటల కరంట్తో పాటు సమయానికి ఎరువులు అందించి ఆదుకున్నరు. ఇక రైతు బంధు పథకంతో నాలాంటి రైతులు ఎంతో లాభపడ్డరు. గతంలో అసలు ఇలాంటి ఆలోచన చేసిన నాయకుడే లేడు. నాకున్న ఎకరం భూమికి రెండు విడుతలకు కలిపి రూ. పది వేలు వస్తున్నయ్. మంగళవారం కూడా రైతు బంధు పైసల్ పడినయ్.
ఎనకట పంట పెట్టుబడికి పాసుపుస్తకం కుదువపెట్టి బ్యాంకులో లోను తీసుకునేటోన్ని. పండిన పంట అమ్మినంక లోన్ కడుతుండే. ఇప్పుడు పరిస్థితులు మారినయ్. ఎరువులు, విత్తనాలు కొనేందుకు తిప్పలు తప్పినయ్. గతంలో నారుమడి నుంచి విత్తనాలు, కలుపు, పురుగుల మందులు, ఎరువుల కోసం పడ్డ తిప్పలు ఇప్పటికీ మరువలే. పంట పెట్టుబడితో ఎవుసానికి ఇబ్బంది లేకుంటయ్యింది. సర్కారు ఇచ్చిన పంట పెట్టుబడితో రెండు పంటలు పండించుకుంటున్న. తెలంగాణ సర్కారు ఇచ్చిన భరోసాతో మాలాంటి సన్న, చిన్నకారు రైతులు గతంలో కంటే ఎక్కువ సాగు చేస్తున్నారు. వ్యవసాయం దండగా అన్న ఆనాటి సర్కారు నేడు పండుగలా చేసిన చేసిన ఘనత కేసీఆర్ సారుకు దక్కుతుంది.
– సింధం మహేశ్, తాళ్లపేట, (దండేపల్లి)
డబ్బులచ్చే.. రైతు మురిసె..
సోన్, జూన్ 29 : నాకు గ్రామ శివారులో రెండు సర్వే నంబర్లలో వేర్వేరు చోట్ల 2.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి పట్టా పాసు పుస్తకంలోని సర్వే నంబర్కు సంబంధించిన 20 గుంటల భూమికి తొలిరోజు రూ.2,500 ఖాతాలో జమ అయినట్లు మెస్సేజ్ వచ్చింది. పంట చేలో పని చేస్తున్నప్పుడే డబ్బులు వచ్చినట్లు మెస్సేజ్ రావడంతో చాలా సంతోషమన్పించింది. రెండో రోజైన బుధవారం రెండెకరాలకు సంబంధించిన రూ. 10 వేలు జమ అయినట్లు మెస్సేజ్ వచ్చింది. రెండు రోజుల్లోనే రూ.12,500 నా ఖాతాల్లో జమ అయ్యాయి. వీటిని పంట పెట్టుబడి కోసం ఉపయోగిస్తున్నా. ఇంతకుముందు ఎనిమిది విడుతలుగా 95 వేలు కూడా వచ్చాయి. మొత్తం తొమ్మిది విడుతలుగా రూ.1,07,500 వచ్చాయి.
– అర్జున్ లింగన్న, కూచన్పెల్లి, సోన్ మండలం.
తొమ్మిది విడుతల్లో రూ.3.87 లక్షలు వచ్చాయి..
సోన్, జూన్ 29 : నాకు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2018లో రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.72 వేలు వచ్చాయి. ఆ తర్వాత పెట్టుబడి సాయాన్ని రూ.ఐదు వేలు చేయడంతో 2019, 2020, 2021 ఆరు విడుతల్లో రూ.2.70 లక్షలు వచ్చాయి. ఎనిమిది విడుతల్లో కలిపి రూ.3.42 లక్షలు జమ అయ్యాయి. ఈ వానకాలం పంటలకు సంబంధించి రూ.45 వేలు జమ కానున్నాయి. ఈ తొమ్మిది విడుతలుగా రూ.3.87 లక్షలు అవుతున్నాయి. పెట్టుబడి సాయం అందింస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. వ్యవసాయ భూమి అధికంగా ఉండడంతో ప్రతి సీజన్లో రైతుబంధు రాకముందు తిప్పలు ఉండేవి. ఇప్పుడు పెట్టుబడి రావడంతో అప్పులు లేకుండానే సొంత పెట్టుబడితోనే వ్యవసాయం చేసుకుంటున్నా.
– రాజేందర్రెడ్డి, బొప్పారం, సోన్ మండలం.
సాగుకు అనుకూలంగా చేసుకున్న..
మాది దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామం. 40 ఏండ్లుగా ఎవుసం చేస్తున్న కుటుంబం మాది. కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకంతో మా లాంటి పేద రైతుల పంట పెట్టుబడికి సాయం అందించడం సంతోషంగా ఉంది. నాకున్న ఎకరం భూమికి రెండు విడుతలకు కలిపి రూ. పది వేలు వస్తున్నయ్. దీంతో విత్తనాలు, ఎరువులు కొనేందుకు తిప్పలు తప్పినయ్. రైతు బంధు పథకం ద్వారా మొదటిసారి వచ్చిన డబ్బులతో భూమిని సాగుకు అనుకూలంగా చేసుకున్న. రెండో సారి వచ్చిన డబ్బులతో బావికి మోటరు పెట్టించుకున్న. ఇప్పుడు వరి, పత్తి, మక్క వేసుకుంటున్న. ఈ వానకాలంలో కూడా వరి సాగు చేస్త. రెండో పంటగా మక్క, కూరగాయలు పండిస్త. సీఎం కేసీఆర్ సారు రాకముందు మా భూమికి పట్టా లేకుండే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక భూమికి రూపాయి ఖర్చు లేకుండా కొత్త పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. ఇప్పుడు రైతుబంధుతో పాటు, రైతుబీమాకు అర్హున్ని అయిన. రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం. –చెనాల పెద్దులు, లింగాపూర్,(దండేపల్లి)
బాకీ లేకుండా ఎవుసం జేస్తన్న..
నా వయస్సు 65 ఏండ్లు. 45 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. యేటా వానకాలం, యాసంగి వచ్చిదంటే విత్తనాలు, ఎరువుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకోనేటోళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడి సాయం అందించడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నం. ప్రైవేటు అప్పుల బాధ తప్పింది. పండిన పంటకు తోడు సర్కారు చేసే సాయంతో పైసా అప్పు లేకుండా ఎవుసం జేస్తున్న. 2018 నుంచి ఇప్పటివరకు రూ.86 వేల రైతుబంధు సాయం అందింది. ఈ వానకాలానికి సంబంధించి డబ్బులు బుధవారం నా ఖాతాలో జమ అయ్యాయి.
– సరికెల రాజేశ్వర్, రైతు, బొప్పారం.
వడ్డీ వ్యాపారుల బాధ తప్పింది..
రైతు బంధు పైసలు ప్రభుత్వమే ఇస్తుండడంతో, ఇప్పుడు వడ్డీ వ్యాపారుల బాధ తప్పింది. ఇంతకు ముందు దళారులు, వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి ఏడాదికి 25శాతం వడ్డీకి గింజలు, మందులు, పెట్టుబడి ఖర్చులకు తెచ్చుకునే వారు. కానీ తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారింది. మాకు 9 ఎకరాల భూమి ఉంది. ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తున్నరు. ఈ పైసలతో పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొంటున్న. పంట పెట్టుబడి సాయంతో ప్రభుత్వం రైతులకు అండగా నిలవడం సంతోషంగా ఉంది.
–గటుక రాజు, యువరైతు
విత్తనాలు, ఎరువులు కొంట..
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పైసలు మంచిగ పనికొస్తున్నయ్. నాకు రెండెకరాల భూమి ఉన్నది. మా కుటుంబంలో అందరికీ కలిపి పదెకరాలు ఉంది. మొదటి యేడు నాకు విడుతకు 8 వేల చొప్పున వచ్చినయ్. ఆ తర్వాత ఏడాది నుంచి ఎకరాకు రూ.10వేల చొప్పున వస్తున్నయ్. రైతుబంధు పైసలు పంట పెట్టుబడికి మంచిగ పనికివస్తున్నయ్. ఇప్పుడు కూడా డబ్బులు పడంగనే విత్తనాలు, ఎరువులు కొంట. పెట్టుబడి ఖర్సులకు ఈ సర్కారు మంచిగ సాయం చేస్తున్నది. గతంలో గిట్ల చేసినోళ్లే లేరు.
–మలపతి అశోక్, రైతు, జామిడి
సంతోషంగా సాగు చేస్తున్న..
నాకు రెండెకరాల భూమి ఉంది. మా కుటుంబ సభ్యులందరికీ కలిసి ఎనిమిదెకరాల భూమి ఉంది. రైతుబందు పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా క్రమం తప్పకుండా రైతుబంధు పైసలు పడుతున్నయ్. సీఎం కేసీఆర్ సార్ దేవునోలె అన్నదాతలకు అండగా నిలుస్తున్నడు. గతంలో ఏ ప్రభుత్వామూ ఇలా మమ్మల్ని పట్టించుకోలే. రైతుబంధు పైసలతో మా పెట్టుబడి కష్టాలు పోయినయ్. రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటరు.
–సిరిగిరి లక్ష్మీపతి, రైతు పొన్నారి
మా బతుకుల్లో మార్పు కానొస్తున్నది..
మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామం. మా ముత్తాతల నుంచి ఎవుసమే ఆధారం. గతంలో చానా ఇబ్బందులుండే. తెలంగాణ అచ్చినంకనే మా బతుకుల్లో కొంత మార్పు కానొస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం రైతులను సక్కగా చూసుకుంటున్నది. గత పాలకులు ఎవుసం అంటే దండుగ అంటే.. ఇయ్యాల కేసీఆరే పండుగలా చేసిన్రు. రైతన్న నవ్వుతున్నడంటే సీఎం కేసీఆర్ చేసిన సాయం వల్లే. రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5 వేలు ఇయ్యడమంటే ఎంతో పెద్ద సాయం. నాక్కూడా రైతుబంధు పైసలు పడ్డయ్. నాకు మూడెకరాల భూమి ఉంది. మూడెకరాలకు కలిపి రూ. 15 వేలు అకౌంట్ల వేసిన్రు. ఈ పైసలతోని ఎరువులు, విత్తనాలు కొంట. ఏటా రెండు పంటలకు కలిపి రూ.30 వేలు అకౌంట్ల పడుతున్నయ్. సర్కారు ఈ పైసలు ఇస్తున్నది కావట్టే రెండు పంటలు పండిస్తున్న. గతంలో వరి పంట ఒక్కటే వేస్తుంటిని. ఇప్పుడు కూరగాయలు, పత్తి పెడుతున్న. సీఎం కేసీఆర్ సారు ఇచ్చిన భరోసాతోటి చిన్న చిన్న రైతులు గతంలో కంటే ఎక్కువ సాగు చేస్తున్నరు. ఆయన చెయ్యవట్టే ఇయ్యాల పంటలు మస్తుగ పండుతున్నయ్.
–ఎర్రం మల్లేశ్, రైతు