మంచిర్యాల, జూన్ 27, నమస్తే తెలంగాణ : నేటి నుంచి రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. నాలుగేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న పథకం ఈ వానకాలం సీజన్కు సంబంధించి మంగళవారం నుంచి తొమ్మిదోసారి పెట్టుబడి సాయం అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. విడుతల వారీగా జమచేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. మంచిర్యాల జిల్లాలో లక్షా 39 వేల మందికి పైగా ప్రయోజనం కలుగనుండగా, ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నేటి నుంచి పంపణీ..
ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నది. దీంతో పాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములకు పెట్టుబడి సాయం అందజేయనున్నది. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను ఏఈవోలకు అందించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం గతేడాది వానకాలం సీజన్లో కొత్త లబ్ధిదారుల నమోదుకు జూన్ 10 కటాఫ్గా నిర్ణయించింది. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు మళ్లీ జాబితాలో మార్పులు, చేర్పులు జరుగనున్నాయి.
కొత్తవారికీ అవకాశం..
2021 జూన్ 10 నుంచి ఈ యేడాది జూన్ 5 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన మార్పులు, చేర్పుల డాటాను సీసీఎల్ఏ తాజాగా వ్యవసాయ శాఖకు అందించింది. ఈ మేరకు ఏఈవోలు కొత్త ఎంట్రీలు చేయనున్నారు. ఓ వైపు రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతూనే, మరోవైపు నూతన లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. గత యాసంగి 2021లో జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లో 1,39,195 మంది రైతులకు రూ. 164 కోట్ల 59 లక్షల ను రైతుల ఖాతాల్లో జమచేశారు. నూతన లబ్ధిదారుల నమోదుతో ఈ యేడు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
పండుగలా వ్యవసాయం..
సాగు పెట్టుబడల బాధలు తీర్చేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతుల జీవితల్లో వెలుగులు నింపుతున్నది. దండగా అన్న సమైక్య పాలకుల కండ్లు తెరిపించేలా వ్యవసాయాన్ని పండుగలా చేసింది. విత్తు నుంచి మొదలు మందుల దాకా వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించి ఆదుకుంటున్నది. వానకాలం ఆరంభంలోనే రైతుబంధు సాయాన్ని అందించి, సర్కారు భరోసానిస్తుండగా, మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమచేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది.
దేశంలోనే ఏకైక రైతు ప్రభుత్వం..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ చేయూతనిస్తున్నది. దేశంలోనే ఏకైక రైతు ప్రభుత్వం తెలంగాణనే. కరోనా కష్టకాలంలోనూ ఆదుకున్నది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పెట్టుబడి సాయం సకాలంలో అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు రైతుల తరఫున కృతజ్ఞతలు.
– మోట పలుకల గురవయ్య, రైతు బంధు సమితి జిల్లా చైర్మన్, మంచిర్యాల