నిర్మల్ అర్బన్, జూన్ 25 : బాలికా విద్యకు సర్కారు భరోసా కల్పిస్తున్నది. చదువుతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశపెడుతున్నది. దీంతో విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఒకప్పుడు డ్రాపౌట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీలు ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఇందులో డ్రాపౌట్ విద్యార్థులే కాకుండా రెగ్యులర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరేందుకు బారులు తీరుతున్నారు. దీంతో ప్రభుత్వ, కేజీబీవీ కళాశాలల్లోనూ విద్యార్థినుల ఎన్రోల్మెంట్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించడం, సన్నబియ్యంతో కూడిన రుచికరమైన ఆహారాన్ని అందించడం, కార్పొరేట్ స్థాయి ర్యాంకులు సాధించడం, ప్రైవేట్ కళాశాలల్లో వేలకువేలు ఫీజులు చెల్లించలేక సర్కారు బాట పడుతున్నారు. దీనికితోడు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు ఉండడంతో వారి చదువులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని అధ్యాపకులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జిల్లాలో 10 కేజీబీవీ కళాశాలలు..
నిర్మల్ జిల్లాలో మొత్తం 19 మండలాల్లో 10 కేజీబీవీ కళాశాలలున్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. దీనికితోడు విద్యార్థుల సౌకర్యార్థం కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అధునాతన హంగులతో నూతన కళాశాలల భవనాలను నిర్మించింది. నిర్మల్ జిల్లాలో నిర్మల్ అర్బన్, లక్ష్మణచాంద, మామడ, కడెం, జాం, నర్సాపూర్, దిలావర్పూర్, దస్తురాబాద్, ముథోల్ మండలాల్లో ప్రభుత్వం కేజీబీవీలను దశలవారీగా కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. ఇందులో ముథోల్, దస్తురాబాద్ కేజీబీవీలను కళాశాలలుగా మారుస్తూ గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం అన్ని మండలాల్లోని పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ బాలికా విద్యను మరింత చేరువ చేసే దిశగా చర్యలు చేపడుతున్నది
రెగ్యులర్తో పాటు ఉపాధి కోర్సులు..
విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రభుత్వం వివిధ కోర్సులను ప్రవేశపెడుతూ ఉచిత విద్యను అందిస్తున్నది. ప్రస్తుతం సంప్రదాయ కోర్సులైన ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సును సైతం ప్రవేశపెట్టింది. ముథోల్, మామడ, కడెం కళాశాలల్లో ఎంపీహెచ్డబ్ల్యూ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రూపునకు మొదటి సంవత్సరం 40 (రెండు కోర్సులకు కలిపి 80), రెండో సంవత్సరం మరో 40 (రెండు కోర్సులకు కలిపి 80) సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి కళాశాలలో 90 శాతానికి పైగా, నిర్మల్ అర్బన్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
విస్తృత అవగాహన కల్పిస్తున్న అధ్యాపకులు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న ఉచిత విద్య, వసతి, సదుపాయాలపై ప్రైవేట్ కళాశాలలకు దీటుగా అధ్యాపకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు సర్కారు కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో నాణ్యమైన విద్య దొరకకా.. అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేక, ఫీజుల భారం భరించలేక సర్కారు కళాశాలల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థులు తమ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని కేజీబీవీ కళాశాలల్లో చేరాలని అవగాహన కల్పిస్తున్నారు.
కళాశాలలను మరింత బలోపేతం చేస్తాం..
కస్తూర్బా విద్యాలయాలు, కళాశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు స్వస్తి పలికి సర్కారు బాట పడుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు బతోపేతం అవుతుండడం ఇందుకు నిదర్శంగా చెప్పవచ్చు. ఒకప్పుడు డ్రాపౌట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీలు ప్రస్తుతం కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పోటీ పడుతున్నాయి. విద్యార్థినులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారు. ఇందుకు నిదర్శనం లక్ష్మణచాంద కేజీబీవీ విద్యార్థిని ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడమే.
– శ్రీదేవి, సెక్టోరియల్ అధికారి, నిర్మల్