ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యమనే నినాదంతో టీఎస్ ఆర్టీసీ ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో మొదలుపెట్టిన కార్గో సేవలు సంస్థకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండేళ్ల క్రితం ఈ సేవలను ప్రారంభించగా, ఆదాయంతో పాటు ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతున్నది. సకాలంలో డెలివరీతో పాటు నమ్మకమైన వ్యాపారం చేస్తుండడంతో అనతికాలంలో ఈ సేవలకు గుర్తింపు దక్కింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఐదు డిపోలు ఉండగా, 38 చోట్ల బుకింగ్ సెంటర్లను ఆర్టీసీ యంత్రాంగం అందుబాటులో ఉంచింది.
నిర్మల్ టౌన్, జూన్ 22: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన కార్గో సేవ లు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. సంస్థకు ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుతున్నా యి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, ఉట్నూ ర్ డిపోలుండగా, మొత్తం 625 బస్సు సర్వీసులు ప్రయాణికుల కోసం సిద్ధం చేశారు. 2020 జూన్ 19న తెలంగాణ ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలను అం దుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఐదు డిపోలుండగా.. 38చోట్ల కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం 38 మంది సిబ్బందిని నియమించగా.. ఐదుగురు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు, ఒకరు రీజియన్ కంప్యూటర్ ఆపరేటర్, 32 మందిని పార్సిల్ డెలివరీ సేవల కోసం వినియోగిస్తున్నారు. బస్సులో పార్సిళ్లను వేసేందుకు మరో 40 మందికి ఉపాధి అవకాశం లభిస్తోంది.
రెండేళ్లలో పెరిగిన ఆదాయం..
కార్గో పార్సిల్ నమ్మకమైన సేవలు అందిస్తుండడంతో, ఆర్టీసీకి అదనంగా భారీగా ఆదాయం సమకూరుతున్నది. 2020-21లో 1,27,130 పార్సిళ్లు బుక్ కాగా.. రూ.1,06,63,321 ఆదాయం వచ్చింది. 2021-22 సంవత్సరంలో 2,58,622 పార్సిళ్లు బుక్ కాగా.. రూ.2,69,25,843 ఆదాయం వచ్చింది. రెండేళ్లలో మొత్తం పార్శిళ్లు 3,85,782 బుక్ కాగా.. రూ.3,75,89,164 ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ కార్గో అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్గో సేవల ద్వారా ప్రతినిత్యం పూలు,పండ్లు, కూరగాయలు, కవర్లు, చిన్నచిన్న సామగ్రిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా కరీంనగర్, విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తదితర రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు.
వినూత్న పథకాలతో విభిన్నమైన సేవలు
టీఎస్ ఆర్టీసీలో కార్గో సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడు మొదటగా గూడ్స్ వస్తువులతో పాటు కవర్లు, ఇతర చిన్న చిన్న సామగ్రి మాత్రమే సరఫరా చేసే వారు. ఆ తర్వాత వినూత్న పథకాలతో ఆదాయ మార్గాలను పెంచుకున్నారు. ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన సమ్మక్క సారక్క జాతరలో బెల్లం ప్రసాదాల పంపిణీ, జగిత్యాల నుంచి బంగిన్పల్లి మామిడిపండ్ల సరఫరా, శ్రీరాముని కల్యాణోత్సవ తలంబ్రాల బుకింగ్ వంటి కార్యక్రమాలతో ఆదాయ మార్గాలను కార్గో పెంచుకుంది. ఆర్టీసీ సిబ్బంది కార్గో సేవలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు నమ్మకమైన డెలివరీ అందించడంతో అనతికాలంలోనే గుర్తింపు వచ్చింది.
కూలీలు, డ్రైవర్లకు అదనపు ఆదాయం
కార్గో సేవల ద్వారా బుకింగ్ చేసుకున్న పార్సిళ్లు, సామగ్రిని తరలించే క్రమంలో చేయూతనందిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు పార్సిళ్లు బస్సుల్లో ఎక్కించే కూలీలకు అదనపు ఆదాయం లభిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్సిళ్లను బస్సులో వేయడంతో పాటు, వచ్చిన వాటిని సేకరించేందుకు 38 మంది సిబ్బందిని నియమించారు. వీరికి ఒక్కొక్క పార్సిల్కు తక్కువ బరువుంటే రూ. 10, ఎక్కువ బరువు ఉంటే రూ. 30నుంచి రూ. 50 వరకు రేటు చెల్లిస్తున్నారు. దీంతో రోజుకు రూ. 700 నుంచి రూ. 1000 వరకు కూలి లభిస్తున్నది. ఆర్టీసీ డ్రైవర్లు పార్సిళ్లను తరలిస్తే వారికి కిలోమీటరును బట్టి అదనపు ఆదాయం ఇస్తున్నారు. ఒక్కొక్క పార్సిల్కు రూ. 10-20 ఆదాయం రావడంతో డ్రైవర్లకు నెలకు రూ. 1500- రూ. 2000 వరకు అదనపు ఆదాయ వస్తున్నదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆన్లైన్ బుకింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పార్సిల్కు 5కిలోల వరకు రూ. 60, పది కిలోల వరకు రూ. 85, 30 కిలోల వరకు రూ. 100 చొప్పున చార్జి వసూలు చేస్తుండగా.. 500 గ్రాముల కవరుకు రూ. 30, ఆపై ఉంటే రూ.45 చార్జి తీసుకుంటున్నారు. ఇందుకోసం హెల్ప్లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. డీఎంఈ హెల్ప్ లైన్ నం. 9154298547, డీఎంఈ 552, ఏటీడబ్ల్యూ 8125448423 నంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు.
సేవలు సద్వినియోగం చేసుకోండి..
టీఎస్ ఆర్టీసీలో కార్గో సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 38చోట్ల కార్గో సేవలను అందుబాటులో ఉంచాం. నిత్యం సుమారు 3వేల నుంచి 4వేల వరకు పార్సిళ్లు బుకింగ్ అవుతున్నాయి. 4వేల నుంచి 5వేల వరకు ఇతర ప్రాంతాల నుంచి సేకరిస్తున్నాం. త్వరలో హైదరాబాద్, పెద్ద నగరాల్లో హోం డెలివరీ సేవలను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండేళ్ల కాలంలో కార్గో ద్వారా రూ. 3.75కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీకి అదనపు ఆదాయం అందిస్తున్న వినియోగదారులు, ప్రయాణికులకు కృతజ్ఞతలు.
-సుధా పరిమళ, ఆర్టీసీ ఆర్ఎం, ఆదిలాబాద్
శ్రమ, ఖర్చు తగ్గింది..
నిర్మల్లో 20ఏళ్ల నుంచి పూల వ్యాపారం చేస్తున్న. గతంలో పూలు కొనాలంటే హైదరాబాద్, నాందేడ్ వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయం, బస్సు చార్జీలు తడిసి మోపెడయ్యేవి. పూల ధర కంటే ఇతర ఖర్చులు ఎక్కువ కావడంతో ఆ భారం వినియో గదారులపై వేసేవాళ్లం. ఇప్పుడు కార్గో సేవల ద్వారా ఫోన్లో డబ్బులు వేస్తే అక్కడి నుంచి పూలు పంపిస్తున్నరు. దీంతో మాకు శ్రమ, ఖర్చులు తగ్గాయి. చాలా సంతోషంగా ఉంది.
-సురేశ్, పూల వ్యాపారి, నిర్మల్
నమ్మకమైన సేవలు అందిస్తున్నం..
వినియోగదారులకు నమ్మకమైన సేవలను అందించడం వల్లే కార్గో పార్సిల్కు మంచి స్పందన వస్తు న్నది. కార్గోలో పార్సిల్ వచ్చినా, వెళ్లినా సమాచారాన్ని ఆన్ లైన్లో నమోదు చేస్తున్నాం. కస్ట మర్లకు ఫోన్ చేసి పార్సిల్ను అందించడం వల్ల కస్టమర్లు రోజురోజుకూ పెరుగుతున్నారు. మరి కొంత మంది సిబ్బందిని నియమిస్తే మరింత వేగంగా సేవలు అందుతాయి. -నర్సయ్య, కార్గో సిబ్బంది
అదనపు ఆదాయం వస్తున్నది..
ఆర్టీసీలో 20ఏళ్ల నుంచి పని చేస్తున్న. గతంలో ప్రయాణికులను ఎక్కించుకొని సురక్షితంగా దింపేవాళ్లం. ఇప్పుడు కార్గో పార్సిల్ సేవలను కూడా అందిస్తున్నం. రోజూ నిర్వహించే విధులతో పాటు పార్సిల్ తీసుకెళ్లే బాధ్యతను ఉంచడంతో జీతం కంటే పార్శిల్ సేవల ద్వారా ప్రతినెలా రూ. 2వేల అదనపు ఆదాయం వస్తున్నది. ఇవి ఖర్చులకు సరిపోతున్నయి. కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీకి మంచి ఆదరణ కూడా లభించింది.
-ఎండీ మహ్మద్, డ్రైవర్
ఇంటికే తెచ్చి ఇచ్చిన్రు..
ఇటీవల శ్రీరాములోరి కల్యాణోత్సవానికి వినియో గించిన ముత్యాల తలంబ్రాలను కార్గో సేవల ద్వారా బుక్ చేసుకున్నం. కల్యాణోత్సవం ముగిసిన మూడు రోజులకే ఆర్టీసీ సిబ్బంది రాములోరి కల్యాణోత్సవంలో వినియోగిం చిన ముత్యాల తలంబ్రాలను ఇంటికే తెచ్చి ఇచ్చిన ప్పుడు సంతోషం అన్పించింది. ఉత్సవాలకు వెళ్లలేక పోయినా, రాములోరి తలంబ్రాలు చూసే భాగ్యం ఆర్టీసీ కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది.
-విజయలక్ష్మి, నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్