ఎదులాపురం, జూన్ 22 : సరికొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం టీ హబ్, టీఎస్ఐసీ ఆధ్వర్యంలో నూతన ఆవిష్కరణలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్నాలజీలో వ్యవస్థాపకత స్ఫూర్తిని చాటుతూ టార్చ్ ప్రీ రన్ నిర్వహించారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు తమ ఆవిష్కరణలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. సృజనాత్మకతతో తయారు చేసిన నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం సహకారంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నదని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ను ప్రభుత్వం హైదరాబాద్లో ఈ నెల 28న ప్రారంభించనున్నదని తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఆవిష్కరణలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వపరంగా అందించే ప్రోత్సాహకాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని యువత, మహిళలు, రైతులు సద్వినియోగం చేసుకొని, నూతన ఆవిష్కరణలు తయారీకి కృషి చేయాలన్నారు. అనంతరం ఇన్నోవేషన్లు తయారు చేసిన పలువురిని శాలువాతో సన్మానించి, కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, డీపీవో శ్రీనివాస్, డీఈవో ప్రణీత, సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఈడీఎం రవి, టీఎస్ఐసీ, టీ హబ్ నిర్వాహకులు ప్రణ య్, ఇబాద్, అధికారులు, విద్యార్థులు, రైతు లు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.