ఆదిలాబాద్ రూరల్, జూన్ 18 : మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్లోని ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆయుష్, మున్సిపల్, జిల్లా క్రీడా మండలి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో 30ఏండ్ల వయస్సు నుంచే ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు.
యోగా వల్ల మానసిక, దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలనిఆయన కోరారు. ఎన్సీసీ క్యాడెట్లు, వైద్యసిబ్బంది, డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ అనంతరం కలెక్టర్ చౌక్లో మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి విజయవంతం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదిలాబాద్లోని బొక్కలగూడలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను సన్మానించి నగదు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వానకాలం నేపథ్యంలో పట్టణంలోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించామన్నారు. ప్లాస్టిక్ను వాడవద్దని, చెత్తాచెదారాలు కాలువల్లో వేయవద్దని ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, వార్డు ప్రత్యేకాధికారి రవికుమార్, పండ్ల శ్రీనివాస్, ఎస్ఐ నరేందర్ పాల్గొన్నారు.