ఎదులాపురం, మే 25 : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నిర్వహించే పనులను నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ మన ఊరు- మన బడి కింద చేపట్టే పనులు ఆయా ఏజెన్సీల పర్యవేక్షణలో నిర్వహించడం, నాణ్యత కలిగి ఉండాలని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రతి మండలంలో రెండు పాఠశాలలు, మోడల్ పాఠశాలలుగా రూపొందించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, అవసరమైన సరుకుల అంశాలపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు.
గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలల్లో కిచెన్ షెడ్, ప్రహరీ, మరుగుదొడ్లను ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 207 పనులకు రూ.47 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేయడంతో పాటు పనులు ప్రారంభించామని తెలిపారు. టెలీకాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఈవో ప్రణీత, డీఆర్డీవో కిషన్, జిల్లా రిసోర్స్ పర్సన్ శ్రీపాద్, ఇంజినీరింగ్ ఏజెన్సీలు, సెక్టోరియల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.