ఆదిలాబాద్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతున్నది. ఒక్కో పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ ఇవ్వడంతో పల్లెలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు. పంచాయతీ శుభ్రం కావడంతోపాటు చెత్తతో ఎరువులు తయారు చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్తో నీటిని అందిస్తుండడంతో ఉపాధి హామీ ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఇలా.. ఒక్క ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) జీపీకి రెండున్నరేళ్లలో రూ.10 లక్షల ఆదాయం సమకూరింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులను సమకూర్చుతోంది. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేలా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి జీపీకి ట్రాక్టర్తో పాటు ట్రాలీ, ట్యాంకర్ను అందజేశారు. గ్రామాల్లో సేకరించిన చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసుకునేందుకు రూ.2.5 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. ఈ రెండింటితో పంచాయతీలు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. గ్రామాల్లో సేకరించిన చెత్త ద్వారా ఎరువులను తయారు చేస్తూ రైతులకు విక్రయిస్తున్నారు.
పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడకం మంచి ఫలితాలను ఇస్తుండడంతో రైతులు ఎక్కువగా ఈ ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో ఖాళీ ప్రదేశాలు, వైకుంఠధామాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటారు. మొక్కల పెంపకంలో భాగం గా వాటికి నీరు పోయాల్సి ఉంటుంది. ఉపాధిహామీ లో భాగంగా జీపీల ట్రాక్టర్, ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఉపాధిహామీ నిధులు రూ. 400 ట్యాంకర్కు చెల్లిస్తారు. ఈ డబ్బులు నేరుగా జీపీల ఖాతాల్లో జమవుతున్నాయి.
ముక్రా(కే) జీపీకీ రూ.10 లక్షల ఆదాయం
పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్, మంజూరైన ట్రాక్టర్తో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ రెండున్నరేండ్లలో రూ.10 లక్షల ఆదాయం సమకూర్చుకుంది. ట్రాక్టర్, ట్రాలీతో రోజూ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. సెగ్రిగేషన్ షెడ్లో తడిచెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ఎరువు తయారవుతుండగా మూడు నెలల్లో 50 క్వింటాళ్ల వర్మికంపోస్ట్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఎరువులను సంచుల్లో నింపి విక్రయిస్తున్నారు. జిల్లాలో వర్మి కంపోస్ట్కు బాగా డిమాండ్ ఉండడంతో 50 కిలోల బ్యాగు రూ.1000 ధర పలుకుతున్నది.
వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు గ్రామానికి వచ్చి ఎరువును కొనుగోలు చేస్తున్నారు. సేంద్రియ ఎరువుల తయారీ వల్ల ఇప్పటి వరకు రూ.6 లక్షల ఆదాయం వచ్చినట్లు గ్రామ పంచాయతీ సభ్యులు తెలిపారు. గ్రామంలో రెండేళ్లలో 18 వేల మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణలో భాగంగా వానకాలం మినహా ఏడాదిలో 9 నెలల పాటు వీటికి నీరు పోయాల్సి ఉంటుంది. ఇందుకు గానూ ఉపాధి హామీ డబ్బులు రూ.4 లక్షలు వచ్చినట్లు సర్పంచ్ మీనాక్షి గాడ్గే తెలిపారు. పంచాయతీ ఆధ్వర్యంలో పల్లెప్రగతిలో భాగంగా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్, మంజూరైన ట్రాక్టర్ ద్వారా రెండేళ్లలో రూ.10 లక్షల ఆదాయం వచ్చినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
అవకాశాన్ని వినియోగించుకోవాలి
పల్లెప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. సేంద్రియ ఎరువుల తయారీతో పాటు ట్రాక్టర్ను వివిధ పనులకు ఉపయోగించవచ్చు. వర్మి కంపోస్ట్ తయారీ, ట్రాక్టర్ ద్వారా హరితహారం మొక్కలకు నీరందించడం వల్ల మా పంచాయతీకి రెండేళ్లలో రూ.10 లక్షల ఆదాయం వచ్చింది. పంచాయతీ పాలకవర్గాలు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఆదాయాన్ని సమకూర్చుకోవాలి.
– మీనాక్షి గాడ్గే, సర్పంచ్, ముక్రా(కే), ఆదిలాబాద్