నిర్మల్, మే 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనబోమన్నా, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలిచింది. కేంద్రాల ఏర్పాటు మొదలుకొని గన్నీ బ్యాగులు, కాంటాలు, తేమ యంత్రాలు, ఇతర సౌకర్యాలపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. యాసంగి సీజన్కు సంబంధించి నిర్మల్ జిల్లాలో 173 కేంద్రాలను ఏర్పాటు చేసి, వరిధాన్యం కొనుగోళ్లను చేపట్టింది. ఈనెల మొదటి నుంచే సేకరణ ప్రారంభమవగా, ఇప్పటికే 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయా కేంద్రాలకు పోటెత్తింది. ఈ సీజన్లో లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వస్తుందని అంచనా వేస్తుండగా, ఇప్పటికే పంట అమ్మిన రైతుల ఖాతాల్లో రూ. 15 కోట్లు జమ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశారు. ముందస్తుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మెజారిటీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే అవసరమైన గన్నీ బ్యా గులు, కాంటాలు, తేమ యంత్రాలు, ఇతర సామగ్రిని కూడా కేంద్రాలకు అందజేశారు. మరోవైపు సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించేలా ట్రాన్స్పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునేలా అదేశాలిచ్చారు. ఈ విషయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక శ్రధ్ద వహించి, కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి అధికారులు, మిల్లర్లతో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు.
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలోని 18మండలాల పరిధిలో మొత్తం 189 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో ప్రస్తు తం 173 కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. హమాలీల కొరత ఉన్న ప్రాంతాలకు బిహార్ నుంచి కూలీలను తెప్పించేందుకు ఏర్పా ట్లు చేశారు.
ఇదిలా ఉంటే యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 68767 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఒక లక్షా 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు వరి కోతలు పూర్తయిన ప్రాంతాల్లోని రైతుల వద్ద నుంచి దాదాపు 32వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వీటికి సంబంధించి కొంత మంది రైతులకు రూ.15కోట్ల వరకు వారి ఖాతాల్లో జమ చేశారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నాలుగైదు రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అ య్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
విస్తృత తనిఖీలు..
వరి కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో క్షేత్రస్థాయిలో అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీతో పాటు అడిషనల్ కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, సివిల్ సైప్లె అధికారులు తరచూ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిచాలని సెంటర్ల నిర్వాహకులకు సూచిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశాలు ఇస్తున్నారు.
సరిపడా గన్నీ బ్యాగులు..
జిల్లాకు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాకు మొత్తం 37లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం జిల్లాలో 6లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 5 లక్షల గన్నీ బ్యాగులను రైస్ మిల్లర్ల నుంచి సేకరించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మిగతా గన్నీ బ్యాగులను వారం రోజుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా గన్నీ బ్యాగులను తిరిగి ఇవ్వని పలువురు రైస్ మిల్లర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. గన్నీ బ్యాగులను వెనక్కి ఇవ్వకుంటే ఒక్కో సంచికి రూ.5 చొప్పున వసూలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు.