రిజన మహిళల్లో రక్తహీనత నివారణకు చర్యలు
5-49 యేండ్ల వయస్కుల కోసం ప్రత్యేక పౌష్టికాహారం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ);రక్తహీనతతో బాధపడుతున్న గిరిజన యువతులు, మహిళలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో మహిళలు, యువతులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించిన సర్కారు.. దాని నివారణకు పూనుకున్నది. ఇందులో భాగంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ను సిద్ధం చేసింది. మొదటి విడుతగా రాష్ట్రంలోని 9 జిల్లాలను ఎంపికచేయగా, అందులో కుమ్రం భీం ఆసిఫాబాద్ కూడా ఉన్నది.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. పోషకాహార లోపంతో గిరిజన మహిళల్లో రక్తహీనత లోపం తీవ్రంగా కనిపిస్తున్నది. జాతీయ కుంటుంబ ఆర్యోగ సర్వే ప్రకారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రక్తహీనత శాతం 76.30గా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో పోషకాహారం అందించడం చాలా కీలకం. కరోనా తదితర కారణాలతో బలవర్తకమైన ఆహారం లేక జిల్లాలోని గిరిజన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులతోపాటు కౌమార దశలో ఉన్న యువతుల్లో సైతం రక్తహీనత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన మహిళల్లో బాల్యం నుంచే సరైన పోషకాహారం లేకపోవడంతో రక్తహీనత తదితర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
దీంతో ప్రసవం సైతం వీరికి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషక్ కిట్స్ అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంతోపాటు ఇప్ప పువ్వు(మహ్వా) లడ్డు కూడా అందిస్తున్నారు. ఇటీవల దొడ్డు బియ్యానికి బదులుగా బలవర్థకమైన బియ్యం సరఫరా చేస్తున్నారు. ఈ బియ్యం ద్వారా రక్తహీనతను నివారించే ఐరన్, గర్భస్త శిశువు వికాసానికి ఉపయోగించే ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి-12 వంటివి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం తాజాగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 15 నుంచి 49 ఏళ్ల యువతులు, మహిళల్లో రక్తహీనత లోపం పూర్తిగా నివారించేందుకు వీలుంటుందని అధికారులు అంటున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లో వెన్న, కర్జూర, న్యూట్రిషన్ బిస్కెట్స్, ఐరన్ మాత్రలు ఉంటాయి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.