ఆదిలాబాద్ రూరల్, మే 22: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.45గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 11256 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయాని కంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే హాల్టికెట్లను ఆయా పాఠశాలలకు పంపిణీ చేశారు. హాల్టికెట్లను హెచ్ఎంలు ఇవ్వకుంటే బీఎస్ఈ వెబ్సైట్ నుంచి కడా డౌన్లోడ్ చేసుకోవచ్చని, వాటిని కూడా అనుమతించనున్నారు.
ఈ ఏడాది పది పరీక్షలను 11 పేపర్ల నుంచి 6కు కుదించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని అధికారులు ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్ష సమయానికి కేవలం 15 నిమిషాల ముందే ప్రశ్నాపత్రాన్ని ఓపెన్ చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డీఈవో టామ్నె ప్రణీత తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తారునీరు, మరుగుదొడ్లు, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
నిర్మల్ జిల్లాలో 9719 మంది విద్యార్థులు
నిర్మల్ అర్బన్, మే 22 : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 9719 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 4967 మంది బాలికలు కాగా..4752 మంది బాలురు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా నిత్యం ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.