నిర్మల్ టౌన్, మే 22 : సమసమాజ అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో భాగ్యరెడ్డి వర్మ జయంతి నిర్వహించారు. మంత్రి అల్లోల భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ముడుసు సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్షులు ప్రబాకర్ తదితరులున్నారు.
ఎదులాపురం, మే 22 : ఆదిలాబాద్లోని దళిత అభివృద్ధి కార్యాలయంలో ఆదివారం భాగ్యరెడ్డి వర్మ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సమసమాజ స్థాపనకు ఆయన ఎన్నో సేవలు చేశారని, హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి పునాదులు వేశారని కొనియాడారు. అంటరానితనం నిర్మూలన, విద్యావ్యవస్థలో మార్పులు, అనేక సంఘ సంస్కరణలకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా దళిత అభివృద్ధి అధికారి సునీతకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, వివిధ దళిత సంఘాల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.