నిర్మల్ అర్బన్, మే 22 : పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డీఈవో రవీందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. పట్టణంలోని జుమ్మెరాత్పేట్ ఉన్నత పాఠశాలను ఆదివారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని గదులు, విద్యార్థులకు కల్పించిన వసతులను పరశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్లను ఆదేశించారు. ఆయన వెంట పరీక్షల కమిషనర్ సిద్ద పద్మ ఉన్నారు.
లక్ష్మణచాంద, మే 22: లక్ష్మణచాంద, వడ్యాల్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈవో మధుకర్ తెలిపారు. లక్ష్మణచాందలో 188 మంది, వడ్యాల్లో 150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు.
ఖానాపూర్ టౌన్, మే 22: పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఈవో మధుసూదన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖానాపూర్, పెంబి మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో హాల్టికెట్ల నంబర్లను గదు ల్లో వేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
పెంబి, మే 22: పెంబి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగ తి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కేంద్రంలో 120 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ బాలాజీ తెలిపారు. వేసవి దృష్ట్యా తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు.
భైంసా, మే 22 : పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో సుభాష్ తెలిపారు. పట్టణంతో పాటు భైంసా మండలంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 1635 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
కుంటాల, మే 22 : స్థానిక ఆదర్శ పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. వివిధ పాఠశాలలకు సంబంధించి 222 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. 13 గదులను కేటాయించినట్లు వివరించారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ నరేశ్ గౌడ్ పరిశీలించారు.
జిరాక్స్ సెంటర్ల తనిఖీ
దస్తురాబాద్,మే 22 : పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఐ జ్యోతిమణి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జిరాక్స్ సెంటర్లను ఆదివారం తనిఖీ చేశారు. సెంటర్ల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు జిరాక్స్ కేంద్రాలు తీయవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మధు, సురేందర్, శ్రీనివాస్, తదితరులున్నారు.