ఉట్నూర్, మే 22 : నేటి నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని పూలాజీబాబా విద్యాసంస్థ, బాలికల ఆశ్రమ, బాలుర జిల్లా పరిషత్, క్రీడా పాఠశాల, సెయింట్పాల్ పాఠశాల్లో ఏర్పాటు చేసిన ఆరు పరీక్షా కేంద్రాల్లో 1050 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
నార్నూర్, మే 22 : నార్నూర్లోని తాడిహత్నూర్ జిల్లా పరిషత్, తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 440 మంది, గాదిగూడలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో 140 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు ఎంఈవో రాపెల్లి ఆశన్న తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
తాంసి, మే 22 : పదో తరగతి పరీక్షలకు మండలంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. తాంసి పరీక్షా కేంద్రంలో 121 మంది, కప్పర్ల పరీక్షా కేంద్రంలో 124 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఎంఈవో శ్రీకాంత్ తెలిపారు.
నేరడిగొండ, మే 22 : మండల కేంద్రంలోని జిలా పరిషత్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, లఖంపూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 383 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు మండల విద్యాధికారి అన్రెడ్డి భూమారెడ్డి తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.