ఉట్నూర్ రూరల్, మే 22: ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతుండడంతో కూలీలకు ఉపాధి లభిస్తున్నది. వేసవిలో కూలీ దొరకని సమయంలో ఉపాధి పనుల ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతున్నది. దూరప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా తమ సొంత గ్రామంలో సమయం ఉన్న సందర్భంలో పని చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కూలీలు అంటున్నారు. అదేవిధంగా పని దొరకని కుటుంబాలకు ఉపాధి హామీ ఆసరాగా మారింది ఈ పథకం. గత సంవత్సరం మండలంలోని బీర్సాయిపేట, దంతన్పల్లి, ఘన్పూర్, లక్కారం, గంగన్నపేట, నాగాపూర్, శ్యాంపూర్, హస్నాపూర్, ఉమ్రి, సాలేవాడ(కే) గ్రామాల్లోని చెరువుల్లో ఫిష్పాండ్లు నిర్మించారు. ఈ పనులతో ఒక్కొక్క చెరువులో రోజుకు 150 మంది కూలీలకు ఉపాధి దొరుకుతున్నది.
రైతులకు లాభం
చెరువుల్లో కూలీలతో పూడిక తీయడం ద్వారా రైతులకు లాభంతో పాటు ఆ మట్టిని పంట భూమిలో వేసుకుంటే భూసారం పెరుగుతుంది. చెరువుల్లో నీటి నిల్వ శాతం పెరుగుతున్నది. మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి.
ఉపాధి పనితో కుటుంబానికి ఆసరా
వేసవిలో ఎక్కడ పని దొరకదు. ఈ సమయంలో ఉపాధి పని కల్పించడం ద్వారా మా కుటుంబానికి ఆసరాగా ఉంది. ఎక్కడికో వెళ్లి పని చేయడం కంటే సొంత ఊరిలో పని చేసుకోవడం సంతోషంగా ఉంది.
–సార, ఉపాధి కూలీ,రాజీవ్నగర్
ప్రతి చెరువులో పనులు చేపడుతాం
నీరు ఎండిన ప్రతి చెరువులో ఉపాధి హామీ ద్వారా పూడిక పనులు చేపడుతాం. దీని ద్వారా గ్రామస్తులకు ఉపాధి లభిస్తుంది. చెరువులోతుగా అవుతున్నందున నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతున్నది. అదేవిధంగా పని కోరుకున్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తున్నాం.
–రజినీకాంత్, ఈజీఎస్ ఏపీవో