కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 10 ( నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో మహిళలు రాణించేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. సమగ్ర వ్యవసాయాభివృద్ధి కోసం శిక్షణ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో సేంద్రియ సాగును పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా రైతులు వ్యవసాయంలో రాణించేలా, కావాల్సిన ఆర్థిక సహాయంతోపాటు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా కృషిచేస్తున్నారు. మహిళలు పొదుపుతోపాటు వ్యవసాయంలో స్థిపడేలా సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా కృషిచేస్తున్నారు.
సెర్ప్ ప్రత్యేక చర్యలు..
గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళల అభివృద్ధికి సెర్ప్ ( గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ, తోడ్పాటునందిస్తున్నది. ధన లక్ష్మి రైతు ఉత్పత్తి దారుల కంపెనీని ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరినీ ఈ పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరుస్తున్నారు. వారిలోంచి మహిళా రైతులను గుర్తించి ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు చేస్తూ వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందేలా తోడ్పాటునందిస్తున్నది. తాజాగా తిర్యాణి మండలంలోని మహిళా సంఘానికి వ్యవసాయ పనుల కోసం అధికారులు ట్రాక్టర్ను అందించారు.
292 సంఘాలు.. 4,556 మంది సభ్యులు..
సుస్థిర వ్యవసాయం, జీవనోపాధుల కల్పనలో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాల్లో రైతులను గుర్తించి ఈ సంవత్సరం 292 మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లో మహిళా రైతులు 4,556 మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2018లో 115 మహిళా సంఘాల్లో వ్యవసాయం చేసే మహిళా రైతులను గుర్తించి రూ.28.75 లక్షల సీడ్ ఫండ్ ద్వారా వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించారు. 2019లో సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల కల్పనలో భాగంగా 141 సంఘాలకు రూ.70.50 లక్షలను మంజూరు చేశారు.
యంత్రాలను కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 108 సంఘాలను గుర్తించి మేకల సంతతి పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో 27 మేకల ఉత్పత్తి దారుల సంఘాలకు రూ.6.75 లక్షలతో సీడ్ ఫండ్ ద్వారా మేకలను కోనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ మండలంలో ధన లక్ష్మి రైతు ఉత్పత్తి దారుల కంపెనీ ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో ప్రత్యేకంగా వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇచ్చే యూనిట్ను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.