మందమర్రి మే 10: రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో రూ.15.79 కోట్ల వ్యయంతో చేపట్టిన బతుకమ్మ ఘాట్లు, కమ్యూనిటీ హాళ్లు, చిల్డ్రన్ పార్కుల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఆయన స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి ద్విచక్ర వాహనంపై కలియ తిరిగారు. పలు వార్డుల్లో మహిళలు మంగళహారతులతో విప్ సుమన్కు స్వాగతం పలికారు. యాపల్, అంగడిబజార్, నార్లాపూర్, పోస్టాఫీస్ ఏరియాలో పలువురు మహిళలు సమస్యలను విప్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి హామీ ఇచ్చారు. పలు వార్డుల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నడిచి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో బతుకమ్మ ఘాట్లు, కమ్యూనిటీ హాళ్లు, చిల్డ్రన్ పార్కులు, ఓపెన్ జిమ్ల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీలోని యువత కోసం పలు వార్డుల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మందమర్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందరగా తీర్చి దిద్దుతామని తెలిపారు. మున్సిపాలిటీలో ఇప్పటికే సమీకృత మార్కెట్ నిర్మాణం, కోల్బెల్ట్ రహదారి సుందరీకరణ, తదితర అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షాల ఆరోపణలను, విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు.
ఆయిల్ పాం సాగుతో అధిక లాభాలు
ఆయిల్ పాం సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, దీనిపై రైతులు దృష్టి సారించాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపు నిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని నార్లాపూర్కు చెందిన సింగతి మురళి 10 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగును చేపట్టగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంగళవారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలోని రైతులు విభిన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ఇప్పటికే నియోజక వర్గంలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం మందమర్రి మండలాల్లోని పలువురు రైతులు ఆయిల్ పాం సాగును చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ ప్రభాకర్రావు, టీఆర్ఎస్ నాయకులు జే రవీందర్, మేడిపల్లి సంపత్, బడికెల సంపత్, రాజశేఖర్, ఎండీ అబ్బాస్, బండారు సూరిబాబు, బోరిగం వెంకటేశ్, బత్తుల శ్రీనివాస్, భూపెల్లి కనకయ్య, ఈశ్వర్, ఎర్ర రాజు, తోట సురేందర్, భట్టు రాజ్కుమార్, మద్ది శంకర్, రాం వేణు, మేడిపల్లి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.