నిర్మల్ టౌన్, మే 8 ;పేద ప్రజల రవాణా బండిగా చెప్పుకునే ఆర్టీసీ.. తన ‘మాతృ’ప్రేమను చూపింది. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐదేండ్లలోపు పిల్లలున్న తల్లులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేల మందికి ప్రయోజనం కలిగింది. దీంతో మాతృమూర్తుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. వినూత్న కార్యక్రమాలు అమలుచేసి, సంస్థకు ఆదరణ పెంచుతున్నారు. ఆర్టీసీనే సురక్షితమనే భావనతో ఇప్పటికే గర్భిణులు, చిన్నపిల్లలకు, 60 ఏండ్లు దాటిన వారికి ఉచిత ప్రయాణం.., భద్రాద్రి తలంబ్రాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఐదేండ్లలోపు పిల్లలు ఉన్న తల్లులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు.
దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో సుమారు 556 బస్సుల్లో దాదాపు 10 వేల మంది తల్లులు తమ పిల్లలను తీసుకొని ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎక్కువగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, తెనాలి, కనిగిరి పామూరు, నాందేడ్ తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ మేరకు అర్టీసీ అధికారులు ఆయా బస్టాండ్లలో చిన్న పిల్లలున్న తల్లులను ఆప్యాయంగా పలుకరిస్తూ, ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వివరించారు. బస్సుల్లో ఎక్కిన తల్లులకు ‘ఈ రోజు టికెట్ లేదమ్మా.. ఫ్రీగా వెళ్లవచ్చు..’ అన్ని చెప్పగానే వారు ఎంతో సంబురపడ్డారని డ్రైవర్లు, కండక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు తమ మనోగతాన్ని ‘నమస్తే’తో పంచుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో పదివేల మంది ప్రయాణం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం అందించడంతో సుమారు 10 వేల మంది తల్లులు సద్వినియోగం చేసుకున్నారు. సిబ్బంది అన్ని బస్టాండ్లలో పిల్లలున్న తల్లులను గుర్తించి, ఉచిత ప్రయాణంపై ముందుగానే చెప్పారు. దీంతో చాలా మంది తల్లులు ఆశ్చర్యానికి గురై, సంతోషపడ్డారు. ఈ ఆనందం ఎననడూ మర్చిపోలేనిది. ఆర్టీసీని ఆదరించడం అందరి బాధ్యత.
– సుధాపరిమళ, ఆర్ఎం