శ్రీరాంపూర్, ఏప్రిల్ 13 : సింగరేణి కార్మికులకు జాతీయ కార్మిక సంఘాలు తీరని ద్రోహం చేశాయని, ఇప్పుడు వారి మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. శ్రీరాంపూర్లోని ఎస్సార్పీ-3 గనిపై ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల 11వ వేతన ఒప్పందానికి 10 నెలలైనా అతీగతీ లేదని, పైగా జాతీయ కార్మిక సంఘాలు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని ఆరోపించారు. 50 శాతం వేతన ఒప్పందం సాధిస్తామని ప్రగల్బాలు పలుకుతున్న ఆ సంఘాలు, కనీసం 25 శాతమైనా సాధిస్తాయా అని ప్రశ్నించారు. వేతన ఒప్పంద కాలపరిమితిని ఉన్న 5 ఏండ్లనే తిరిగి కొనసాగిస్తూ ఒప్పందం చేసుకోవడాన్ని జాతీయ సంఘాలు గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
కార్మికులకు ఏం సాధించాలన్నా టీఆర్ఎస్ సర్కారు, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్మికులు ఒక్క పోరాటం చేయకుండానే ఎప్పటికప్పుడు గౌరవ అధ్యక్షురాలి ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించినట్లు చెప్పారు. కార్మికుల హక్కులను పోగొట్టిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలకు కార్మికులను ఓటు అడిగే హక్కులేదన్నారు. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేశాయని దుయ్యబట్టారు. వారి ఉనికి కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. రిటైర్డ్ కార్మికులకు 21 ఏళ్లుగా ఒక్క రూపాయి పింఛన్ పెంచలేని సంఘాలుగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు.
టీబీజీకేఎస్లో చేరికలు..
ఎస్సార్పీ-3 గనికి చెందిన 100 మంది కారుణ్య బదిలీ వర్కర్లు గనిపై పిట్ కార్యదర్శి ఆర్ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో టీబీజీకేఎస్లో చేరారు. కాగా, వారికి ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మల్లారెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం బదిలీ వర్కర్లు మిర్యాల రాజిరెడ్డిని సత్కరించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతినిధి కే వీరభద్రయ్య, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి, పెట్టం లక్షణ్, బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగన్, తొంగల రమే శ్, పిట్ కార్యదర్శులు తిరుపతి, నాయకులు భాస్కర్, చేరాలు, రాజిరెడ్డి, ప్యాగ మల్లేశం, చిలువేరు సదానందం పాల్గొన్నారు.
జాతీయ సంఘాల తీరు ఎండగట్టాలి : కెంగర్ల మల్లయ్య
యైటింక్లయిన్కాలనీ, ఏప్రిల్ 13 : జాతీయ సంఘాల ధ్వందనీతి వల్ల కార్మిక వర్గం తీరని అన్యాయానికి గురవుతున్నదని, వారి తీరును ఎండగట్టాలని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైనా తరువాత మొదటిసారిగా ఆర్జీ-2 ఏరియా ఓసీపీ-3 కృషిభవన్కు వచ్చిన ఆయనకు కార్మికవర్గం ఘన స్వాగతం పలికి, గజమాలతో సన్మానించింది. ఈ సందర్భంగా యూనియన్లో చేరిన 50 మంది కార్మికులకు కండువాలు కప్పి, ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికవర్గం చేతిలో పురుడు పోసుకున్న టీబీజీకేఎస్ దశాబ్దకాలంగా కార్మికుల ఆదరాభిమానాలతో గుర్తింపు సంఘంగా గెలుపొందిందని గుర్తుచేశారు. కార్మికులకు ఇచ్చిన మాటను ఏనాడూ మరువకుండా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి ఫలితంగా ఎన్నో హక్కులు సాధించామన్నారు.
జాతీయ సంఘాలు సాధించిన హక్కుల కంటే పోగొట్టినవే చాంతాడంత ఉన్నాయని విమర్శించారు. కానీ టీబీజీకేఎస్ ఇచ్చిన హామీల కంటే సాధించిన హక్కులే ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సంఘాల తప్పుడు ఒప్పందం వల్ల విరమణ కార్మికులకు రూ.40వేలు చెల్లిస్తే రూ.8 లక్షల వైద్య ఖర్చులు మాత్రమే యాజమాన్యం భరిస్తుందని, అదే అధికారులు ఒక్కపైసా కట్టకుండానే రూ.25 లక్షల వైద్య ఖర్చులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులకు ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడంలేదని, ఒకే సంస్థలో పని చేసిన వారి మధ్య వ్యత్యాసం ఉండేలా ఒప్పందం చేసుకోవడం జాతీయ సంఘాల అవగాహనారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నదని విమర్శించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ జాతీయ సంఘాలు కార్మికులపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. డివిజన్ ఉపాధ్యాక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు దేవ వెంకటేశం, బదావత్ శంకర్నాయక్, కొత్త సత్యనారాయణరెడ్డి, నాచగోని దశరథం గౌడ్, చెరుకు ప్రభాకర్రెడ్డి, ఆకుల రాజిరెడ్డి, బేతి చంద్రయ్య, ఐ సత్యం, ఎల్కలపల్లి సదయ్య, కర్క శ్రీనివాస్, సంజీవయ్య, ఎండీ హమీద్ తదితరులు పాల్గొన్నారు.