నిర్మల్ టౌన్, ఏప్రిల్ 13 : దళిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు.. నిర్మల్ జిల్లాలో నేడు లబ్ధిదారుల ఇంటికి చేరనున్నది. ఈ పథకంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తూ యూనిట్లను లబ్ధిదారులకు గురువారం అం దజేయనున్నది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ము థోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 261 మందిని ఎంపిక చేశారు. రూ.26.10 కోట్ల నిధులను ప్రభుత్వం కలెక్టర్ ఖాతాలో జమచేసింది. ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి 53 మంది లబ్ధిదారులకు.. ఖానాపూర్లో 36 మందికి ఎమ్మెల్యే రేఖానాయక్, ముథోల్లో ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి 75 మందికి యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో 84 ట్రాక్టర్లు 17 ప్యాసింటర్ టాటా మ్యాజిక్లు, 19 గూడ్స్ వాహనాలు, 26 కార్లు, 3 జేసీబీలు, 4 హార్వెస్టర్లు, 1 డీసీఎం అందజేయనున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోనే యూనిట్లు మంజూరు చేసి, పంపిణీ చేస్తుండడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి అల్లోల కృషితోనే..
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు ద్వారా జిల్లాలో 261 మందిని ఎంపిక చేసి, 164 మందికి రూ.16.40 కోట్లతో వాహనాలు అందిస్తున్నం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కృషి ఫలితంగానే సాధ్యమైంది. దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోనే లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేసి, వాహనాలను పంపిణీ చేయడంతో చాలా మంది నిరుద్యోగ యువతీయువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిగతా వారికి కూడా త్వరలో యూనిట్లు మంజూరు చేస్తాం.
– హన్మండ్లు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ, నిర్మల్