ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తెరిపించేదాకా వదలబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జోగురామన్న, సీసీఐ సాధన కమిటీ సభ్యులు బుధవారం మంత్రిని హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిసి, కంపెనీ పునరుద్ధరణకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. సీసీఐని ప్రారంభించేదాకా కేంద్రంపై ఒత్తిడి పెంచుతా మని, తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయితీలు అందిస్తామని చెప్పారు. దీంతో పాటు ఆదిలాబాద్లో ఐటీటవర్, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. -ఆదిలాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆదిలాబాద్, జనవరి 26 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో, మాజీ ఎంపీ నగేశ్, సీసీఐ సాధన కమిటీ సభ్యులు బుధవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో సీసీఐ పునరుద్ధరణలో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. సిమెంటు పరిశ్రమను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పిటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నదని, ఈ విషయంలో కేంద్ర మంత్రులను పలుసార్లు కోరినట్లు తెలిపారు. పరిశ్రమ పునః ప్రారంభానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీసీఐని తెరిపించడానికి అవసరమైన రాయితీలు ఇవ్వడంతో పాటు,కొత్త పరిశ్రమలకు అందించే సబ్సిడీలు వర్తింప జేస్తామని చెప్పారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. సీసీఐని ప్రారంభించాలని ఇప్పటికే పలుసార్లు కేంద్ర మంత్రులను కలిశామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖలు రాశామని తెలిపారు. అనేక ప్రయత్నాలు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఆదిలాబాద్ యువత ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిర్పూర్ పేపర్ మిల్లును ప్రారంభించిందని, సింగరేణిని కూడా ప్రైవేటువరం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఆదిలాబాద్లో ఐటీ టవర్ను ఏర్పాటు చేస్తామని, దీంతో పాటు టెక్స్టైల్ పార్కుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమ కార్యాచరణ చేపడుతామని సాధన కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. స్థానిక ఎంపీని నిలదీస్తామని చెప్పారు. సీసీఐని ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి సాధన సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో కన్వీనర్లు విజ్జగిరి నారాయణ, నంది రామయ్య, అరవింద్, కొండ రమేశ్, వివిధ పార్టీల నాయకులు పోశెట్టి, బండి దత్తాత్రి, ఈశ్వర్, బొర్రన్న, బట్టి శివకుమార్, షేక్ అబ్దుల్లా, జాదవ్ వినోద్, విజ్జగిరి మనోజ్ ఉన్నారు.