ఆదిలాబాద్టౌన్, ఏప్రిల్ 10 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఊరూరా వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షాన కనుల పండువగా సాగింది. ప్రముఖ ఆలయాలు కిక్కిరిసిపోగా, ఎటు చూసినా సందడి కనిపించింది. పలు ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించగా, జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్రావు దంపతులు, కాగజ్నగర్లో ఎమ్మెల్యే కోనప్ప దంపతులు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నిర్మల్ జిల్లా భైంసాలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి సీతారాముడి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా శ్రీ సీతారాముల కల్యాణం కనుల పండువగా సాగింది. వివాహ ఘట్టాన్ని వీక్షించిన భక్తజనం తన్మయత్వంలో మునిగితేలింది. ‘శ్రీరామ జయరామ జయజయ రామ..’ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. భక్తులు, హనుమాన్ దీక్షా స్వాములు శోభాయాత్రలో నృత్యాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా చోట్ల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అన్నదానాలు నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కోత్మీర్లో సర్పంచ్ తరున్నం సుల్తానా సీతారాములోరి కల్యాణాన్ని దగ్గరుండి జరిపించారు. కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి ప్రాణహిత నదిలో సీతారాముల తెప్పోత్సవం నిర్వహించారు. అదే వేదికపై రెండు పేద జంటలకు పెండ్లి చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో శ్రీరామ శోభాయత్ర కనుల పండువగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు, యువకులు పాల్గొన్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావు దంపతులు, కాగజ్నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నిర్మల్ జిల్లా భైంసాలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి సీతారాములకు పూజలు చేశారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాంద(టీ) శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉత్సవమూర్తులకు అభిషేకం, సుముహూర్తంలో సీతారామచంద్రస్వామి కల్యాణం, మహామంత్ర పుష్పం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, సర్పంచ్ భాస్కర్ పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
బోథ్, ఏప్రిల్ 10 : మండలంలోని సొనాల, పొచ్చెర, కౌఠ(బీ), బోథ్ గ్రామాల్లోని రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఇచ్చోడ మండలంలో..
ఇచ్చోడ, ఏప్రిల్ 10 : మండలంలోని పట్వారీగూడ రామాలయం, ఇచ్చోడలోని బాబుల్డోల్ గుట్ట సమీపంలోని శ్రీరామలక్ష్మణ మందిరంలో సీతారాముల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. పట్వారీగూడ రామాలయంలో శ్రీశ్రీ నారాయణ మహారాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించారు. కార్యక్రమంలో గోశాల అధ్యక్షుడు ఐదా రాజేశ్వర్, ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భక్తుల ప్రత్యేక పూజలు
బజార్హత్నూర్, ఏప్రిల్ 10: బజార్హత్నూర్, పిప్పిరి, గిర్నూర్, దేగామ గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలో బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, హనుమాన్ భక్తులు శ్రీ రాముని పల్లకీ శోభాయాత్ర నిర్వహించారు.
తలమడుగు మండలంలో…
తలమడుగు, ఏప్రిల్ 10 : కజ్జర్ల, సుంకిడి గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. రామాలయాల్లో భక్తులు, జడ్పీటీసీ గణేశ్రెడ్డి, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ పోలాల్లో పూజలు చేసి కొత్త పనులను ప్రారంభించారు.
గుడిహత్నూర్, ఏప్రిల్ 10 : గుడిహత్నూర్ శివాలయం, ఉమ్రి(బీ)లో రాంమందిరం, మన్నూర్ గ్రామాల్లో వేదపండితులు, అర్చకులు సీతారాముల కల్యాణం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు.
తాంసిలో..
తాంసి, ఏప్రిల్ 10 : మండలంలోని పాలోడిలోని రాములగుట్ట, బండలనాగాపూర్, కప్పర్లలోని రామాలయం, తాంసిలోని రామలింగేశ్వరాలయం, పొన్నారిలోని రామలక్ష్మణ ఆలయంలో సీతారాములు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సురుకుంటి మంజులాశ్రీధర్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్, సర్పంచ్లు కృష్ణ, వెంకన్న, సదానందం, సంజీవ్రెడ్డి, నర్సింగ్, కేశవ్రెడ్డి, గజానన్, యశ్వంత్, ఎంపీటీసీలు అశోక్, నరేశ్, రఘు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఉట్నూర్లో..
ఉట్నూర్, ఏప్రిల్ 10 : మండల కేంద్రంలోని శ్రీ సాయిగురుదత్త ఆలయంలో పూజారి సంతోష్ దూబే, సదానందం సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. అంతకుముందు వినాయకచౌక్ నుంచి స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారికి తలంబ్రాలు తీసుకువచ్చారు. కల్యాణాన్ని తిలకించేందుకు పట్టణం నుంచే కాకుండా కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు.
జైనథ్ మండలంలో..
జైనథ్, ఏప్రిల్ 10 : మండలంలోని భోరజ్, పిప్పర్వాడ, పెండల్వాడ, దీపాయిగూడ, నిరాల, ఆనంద్పూర్, మాంగుర్ల గ్రామాల్లోని రామాలయాల్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాములు కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, వైస్ఎంపీపీ విజయ్కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
నార్నూర్, ఏప్రిల్ 10: నార్నూర్, గాదిగూడ మండలాల్లోని హనుమాన్ ఆలయాల్లో దీక్షాపరులు, ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 10 : జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు, న్యూహౌసింగ్బోర్డు, రాంనగర్, బ్రాహ్మణవాడలోని రామాలయాల్లో వైభవంగా రాములోరి కల్యాణం నిర్వహించారు. కేఆర్కే, శాంతినగర్లోని ఆలయాల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు భోజనం వడ్డించారు.
భీంపూర్, ఏప్రిల్ 10 : కరంజీ(టీ), అంతార్గం, ఆర్లి(టీ) రామాలయాల్లో శ్రీ రామనవమి వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ స్వాతి, నరేందర్ దంపతులు, వైస్ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్లు బక్కి లలిత, మడావి లింబాజీ, భూమన్న, సీఐ కోల నరేశ్, ఎస్ఐ రాధిక, భక్తులు కల్యాణాన్ని తిలకించారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, ఏప్రిల్ 10 : నేరడిగొండ శబరిమాత ఆశ్రమంలో వేదపండితుడు శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో సీతారామ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తేజాపూర్, కుమారి గ్రామాల్లో భక్తులు శోభాయాత్ర నిర్వహించి నృత్యాలు చేశారు.
ఇంద్రవెల్లి మండలంలో..
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 10 : మండల కేంద్రంతో పాటు ముత్నూర్, దేవాపూర్, పలు గ్రామాల్లోని రామాలయాల్లోభక్తులు ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ దీక్షాపరులు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, తదితరులు పాల్గొన్నారు.