నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు పరిశీలన
సోన్, మార్చి 25 : గ్రామాల్లో వందశాతం సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆయన పర్యటించారు. గ్రామంలో వేస్తున్న సీసీ రోడ్డును పరిశీలించారు. పనులు వేగంగా, నాణ్యతగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చాయి? పనులు ఎంత వరకు పూర్తి చేశారు? అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో శ్రీనివాస్రావు, సర్పంచ్ సుజాతా పోశెట్టి ఉన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
దిలావర్పూర్, మార్చి 25 : గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అంతకుముందు గ్రామంలోని హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి, మొక్కల పెంపకంపై అభినందించారు. గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లను పరిశీలించి పంచాయతీ రాజ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈయన వెంట సర్పంచ్ గంగారెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్, తహసీల్దార్ హిమబిందు, ఎంపీవో అజీజ్ఖాన్, పీఆర్ ఏఈ శివకృష్ణ, ఈజీఎస్ అధికారులు ఉన్నారు.